హైదరాబాద్: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఉప్పల్ వేదికగా జరగనున్న మూడో టీ20 మ్యాచ్ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. గత రెండు, మూడు రోజులుగా టికెట్ల అమ్మకాల విషయంపై నోరు మెదపని హెచ్సీఏ తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయడంతో గురువారం సికింద్రాబాద్ జింఖానా మైదానం వేదికగా ఆఫ్లైన్లో అమ్మకాలు మొదలుపెట్టింది. అయితే ఊహించని రీతిలో టికెట్ల కోసం అభిమానులు పోటెత్తారు. ఉదయం 5 గంటల నుంచే క్యూలైన్లలో నిలబడ్డారు. అయితే అందుబాటులో ఉన్న 5 వేల టికెట్ల కోసం సుమారు 30 వేల మంది తరలి రావడంతో అక్కడ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాటకు దారితీసింది. దాంతో పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో సుమారు 20 మంది అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అనూహ్య ఘటనతో అటు పోలీసులు.. ఇటు అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. హెచ్సీఏ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని పోలీసులు అరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్ టికెట్ల విక్రయాలపై వివరణ ఇవ్వాలని, పూర్తి స్థాయి నివేదికతో వ్యక్తిగతంగా కలవాలని హెచ్సీఏ ప్రెసిడెంట్ మమహ్మద్ అజారుద్దీన్ను తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
హెచ్సీఏ వైఫల్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని మీడియాతో శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మ్యాచ్ టికెట్ల అమ్మకాల వ్యవహారం ప్రభుత్వానికి సంబంధం ఉండదని, 10 రోజుల ముందే టికెట్ల అమ్మకాలు మొదలు పెట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ ఘటనపై ప్రభుత్వం సిరీయస్గా ఉందని, టికెట్ల విషయంలో పూర్తి వివరాలు ఇవ్వాలని హెచ్సీఏతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే తామే జోక్యం చేసుకొని భవిష్యత్తులో మ్యాచ్లు నిర్వహిస్తామని కూడా చెప్పాడు. గాయపడ్డ వారి పరిస్థితి గురించి కూడా ఈ సమావేశంలో చర్చించి నష్టపరిహారం కూడా ఇప్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం హెచ్సీఏ అధికారులతో సమావేశమయ్యారు.
ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సుమారు 16 ఎకరాల్లో 65 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. స్టేడియం సామర్థ్యం 55 వేలు సీట్ల వరకు ఉంటుంది. ఇందులో 39 వేల టికెట్లు మాత్రమే విక్రయిస్తుంటారు. వీటిలో దాదాపు 10 వేల టికెట్ల వరకు కాంప్లిమెంటరీగా ఇవ్వగా మిగిలిన 29 వేల టికెట్లను విక్రయానికి ఉంచుతున్నారు. టికెట్ల ధరలు రూ.850 నుంచి 15000 వరకు ఉన్నాయి. కార్పోరేట్ బాక్స్లు 40 వరకు ఉండగా.. ఒక్కో బాక్స్లో 20 వరకు సీట్ల సర్దుబాటు ఉంటుంది. అయితే మూడేళ్ల తర్వాత నగరంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో సినీ,రాజకీయ, పోలీస్ ప్రముఖుల నుంచి టికెట్ల కోసం హెచ్సీఏ అధికారులపై ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టికెట్లు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.