ముంబై: తాజాగా ఎంపికైన భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది కాంట్రాక్ట్లు సెప్టెంబర్ 5 నుంచి అమల్లోకి వస్తాయని బీసీసీఐ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. కాంట్రాక్ట్లకు సంబంధించిన అన్ని పత్రాలు, ఒప్పందాలు సిద్ధమయ్యాయని.. వచ్చే గురువారంలోగా లాంఛనం పూర్తవుతుందని బీసీసీఐ బోర్డు అధికారి ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ ద్వారా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కమిటీ ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా పలువురు రవిశాస్త్రినే ఎంపిక చేయాలని కోరడంతో కపిల్ కమిటీ అతని వైపే మొగ్గు చూపింది.
అంబులెన్స్లో కివీస్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ఇక భారత చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ నేతృత్వంలోని కమిటీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లను ఎంపిక చేసింది. ప్రసాద్ కమిటీ బౌలింగ్ కోచ్గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్గా ఆర్.శ్రీధర్లు కొనసాగగా... విక్రమ్ రాథోడ్ కొత్త బ్యాటింగ్ కోచ్గా ఎంపికయ్యాడు. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పూర్తిగా విఫలమవడంతో అతని స్థానంలో రాథోడ్కి అవకాశం ఇచ్చారు. అయితే ఫిట్నెస్ అండ్ కండిషనింగ్ ట్రైనర్ను మాత్రం ఇంకా ఎంపిక చేయలేదు. దీనికోసం ప్రస్తుతం ఎన్సీఏలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి.
రవిశాస్త్రి సహా సహాయక సిబ్బంది అందరూ 2021 టి20 ప్రపంచ కప్ వరకు అధికారంలో ఉంటారు. వీరి పదవి కాలం రెండు సంవత్సరాలు. వెస్టిండీస్తో రెండో టెస్టు సెప్టెంబర్ 3తో ముగిసిన రోజునే భారత జట్టు కూడా స్వదేశానికి తిరిగి వస్తుందని భావిస్తున్నారు. అప్పుడు జట్టు సిబ్బంది అందరు అందుబాటులో ఉండనున్నారు. విండీస్ పర్యటనలో ఇప్పటికే టీ20, వన్డే సిరీస్ గెలిచినా విషయం తెలిసిందే. రెండు టెస్ట్ మ్యాచులలో కూడా మొదటి టెస్ట్ గెలిచి.. రెండో టెస్టుపై పూర్తి పట్టు సాధించింది.