
హైదరాబాద్: ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి ఈ విరాట్ కోహ్లీ 200(తొలి ఇన్నింగ్స్లో 149, రెండో ఇన్నింగ్స్లో 51) పరుగులు సాధించాడు.
దీంతో టెస్టుల్లో ఎక్కువసార్లు ఒక మ్యాచ్లో 200 పరుగులు చేసిన భారత బ్యాట్స్మన్గా విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఇంగ్లాండ్పై ఒక టెస్టులో అత్యధిక పరుగులు (200) సాధించిన రెండో టీమిండియా కెప్టెన్గా నిలిచాడు. గతంలో ఈ ఘనతను పటౌడీ 212(తొలి ఇన్నింగ్స్లో64, రెండో ఇన్నింగ్స్లో 148) (1967, లీడ్స్ టెస్ట్లో) సాధించాడు.
అంతేకాదు, వ్యక్తిగతంగా 200 పరుగులు ఎక్కువ సార్లు చేసిన టీమిండియా ఆటగాడిగానూ కోహ్లీ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో విరాట్ కోహ్లీ 11 సార్లు ఈ ఘనత సాధిస్తే.. ద్రవిడ్, సచిన్లు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. వీరేంద్ర సెహ్వాగ్, గావస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాతి స్థానాల్లో నిలిచారు.
ఇదిలా ఉంటే తొలి టెస్టులో కోహ్లీసేన 31 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ నిర్దేశించిన 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తన రెండో ఇన్నింగ్స్లో 162 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. ఓవర్నైట్ స్కోరు 110/5 శనివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 52 పరుగుల మాత్రమే జోడించి మిగతా ఐదు వికెట్లను కోల్పోయింది.
ఫలితంగా టీమిండియా 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. శనివారం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఓవర్నైట్ ఆటగాడు దినేశ్ కార్తీక్(20) ఆదిలోనే పెవిలియన్ చేరగా, కాసేపటికి మరో ఓవర్నైట్ ఆటగాడు, కోహ్లి(51) సైతం ఔటయ్యాడు. దినేశ్ కార్తీక్ను జేమ్స్ అండర్సన్ పెవిలియన్కు పంపగా, స్టోక్స్ బౌలింగ్లో కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత వెంటనే షమీ డకౌట్గా నిష్క్రమించాడు. దాంతో టీమిండియా 141 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో హార్దిక్ పాండ్యా(31) ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కాగా, ఇషాంత్ శర్మ(11) తొమ్మిదో వికెట్గా ఔటైన కాసేపటికి హార్దిక్ పెవిలియన్ చేరడంతో భారత్ ఇన్నింగ్స్ ముగించింది.
ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు తలో రెండు వికెట్లు సాధించగా, శామ్ కుర్రాన్, అదిల్ రషీద్లకు చెరో వికెట్ పడగొట్టారు.