ఆస్ట్రేలియా పర్యటనలో పాక్
బాబర్ అజాం నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న సిడ్నీ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో బాబర్ అజాం మాట్లాడుతూ "ప్రతి పర్యటన కఠినమైనదే. అయితే, అదనపు బౌన్స్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన సవాల్ చేస్తుంది. కానీ మేము ఎప్పటిలాగే విజయాల కోసం వెళ్తాం" అని అన్నాడు.
వ్యక్తిగత ప్రదర్శనపై సంతోషంగా ఉండలేను
"అంతేకాక, ఫలితాలతో సంబంధం లేకుండా నా వ్యక్తిగత ప్రదర్శనపై సంతోషంగా ఉండలేను. జట్టు ప్రదర్శనతో పాటు, నా వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగుండాలని భావిస్తున్నా. ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ను ఆదర్శంగా తీసుకుంటా. వారు బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తూ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నారు" అని బాబర్ అజాం తెలిపాడు.
కెప్టెన్గా, బ్యాట్స్మన్లా
"వారిలాగే కెప్టెన్గా, బ్యాట్స్మన్లా విజయవంతం అవ్వడానికి కృషి చేస్తా. ఆస్ట్రేలియా పిచ్లపై ఎక్స్ట్రా బౌన్స్ లభిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ మా ప్రధాన బలం. జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ పేసర్లూ ఉన్నారు. యువ ఆటగాళ్లు రాణిస్తే అద్భుత విజయాలు సాధిస్తాం. ఆసీస్ పర్యటనలో ఫకర్ జమాన్తో కలిసి ఓపెనర్గా దిగుతా. ఇమామ్ ఉల్ హక్ బ్యాకప్ ఓపెనర్" అని బాబర్ చెప్పుకొచ్చాడు.
ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం
సొంతగడ్డపై పదేళ్ల తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరిస్లో పాకిస్థాన్ 0-3తో క్లీన్స్వీప్కు గురవడంపై బాబర్ స్పందించాడు. "శ్రీలంక ద్వితీయశ్రేణి జట్టుతో మేము ఆడలేదు. యువ ఆటగాళ్లతో ఉన్న జాతీయ జట్టుతో ఆడాం. ఈ సిరీస్ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మూడు మ్యాచుల్లో ఓడినంత మాత్రాన మా ఆటను ఎలా అంచనా వేస్తారు?" అని బాబర్ ప్రశ్నించాడు.