గంగూలీ అండ్ హిస్ టీమ్కు డెడ్లైన్..
ఇప్పుడీ డైలమా నుంచి బీసీసీఐ బయట పడాల్సిన పరిస్థితి ఎదురైంది. రోజులు లెక్కిస్తూ ఉంటే కుదరదని, భారత్లో టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ నిర్వహణ సాధ్యపడుతుందా? లేదా? అనేది స్పష్టం చేయాలని ఆదేశించింది. దీనికోసం డెడ్లైన్ కూడా పెట్టింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ నాటికి భారత్లో టీ20 ప్రపంచకప్ నిర్వహించడానికి అనుకూల వాతావరణం ఉంటుందా? లేదా? అనే విషయంపై సమగ్ర నివేదికను అందజేయాలని బీసీసీఐ అధినేత సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జయ్ షాలకు సూచించింది.
28 నాటికి సమగ్ర నివేదిక..
ఐసీసీ ఆదేశాల ప్రకారం.. ఈ నెల 28వ తేదీ నాటికి భారత్లో టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఓ స్పష్టతను ఇవ్వాల్సి ఉంటుంది బీసీసీఐ. ఈ ఈలోగా- అక్టోబర్ నాటి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ మెగా ఈవెంట్ ఆరంభం అయ్యే సమయానికి భారత్లో కరోనా వైరస్ స్థితిగతులపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వేర్వేరు దేశాల నుంచి భారత్కు వచ్చే క్రికెట్ జట్లు, వాటితో పాటు వచ్చే సపోర్టింగ్ టీమ్, గ్రౌండ్ స్టాఫ్, మ్యాచ్లను కవర్ చేయడానికి వచ్చే వివిధ దేశాల మీడియా ప్రతినిధులు, వారికి కల్పించాల్సిన వసతి.. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని- బీసీసీఐ సమగ్ర నివేదికను అందజేయాల్సి ఉంటుంది.
కరోనా తగ్గుముఖం..
ప్రస్తుతం భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఇది వరకు మూడు లక్షలకు పైగా రోజువారీ కొత్త కేసులు నమోదు కాగా.. ఇప్పుడు వాటి సంఖ్య లక్షన్నరకు పడిపోయింది. కొత్త కేసులు లక్ష నుంచి లక్షన్నర వరకు మాత్రమే రికార్డవుతున్నాయి. మున్ముందు ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదు. దీన్ని ఆధారంగా చేసుకుని చూసుకుంటే.. అక్టోబర్ నాటికి భారత్లో ఈ బిగ్ ఈవెంట్ను నిర్వహించడానికి అనుకూల వాతావరణం ఉండదు- అనడానికి గ్యారంటీ లేదు. రోజువారీ కేసుల క్షీణతలో ఇప్పుడున్న వేగం కొనసాగితే- అప్పటికీ దాని తీవ్రత నామమాత్రంగానే ఉండొచ్చు.
ప్రత్యామ్నాయంగా యుఏఈ
వాటన్నింటినీ బేరీజు వేసుకుంటూ బీసీసీఐ తన సమగ్ర నివేదికను ఈ నెల 28వ తేదీ నాటికి ఐసీసీకి అందజేయాల్సి ఉంటుంది. పరిస్థితులు అనుకూలించకపోతే టీ20 వరల్డ్కప్ను తటస్థ వేదికపైకి తరలించక తప్పదు. ఆ తటస్థ వేదిక- యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మాత్రమే. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లను యుఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అక్టోబర్ రెండో వారంలో ఈ టోర్నీ ముగుస్తుంది. దాన్ని పరిగనణలోకి తీసుకున్నా కూడా ఈ టోర్నీ ముగిసిన వెంటనే కొంతవిరామం అనంతరం అదే యూఏఈలో టీ20 వరల్డ్కప్ను ఏర్పాటు చేయాలనే విషయాన్ని బీసీసీఐ ప్రత్యామ్నాయంగా భావిస్తోంది.