అబుధాబి: యునైటెడ్ ఎమిరేట్స్ వేదికగా కొనసాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో భాగంగా భారత క్రికెట్ జట్టు మరో కీలకమైన మ్యాచ్ను ఆడనుంది. తన రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును ఢీ కొనడానికి సమాయాత్తమౌతోంది. ఈ ఆదివారం ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. ఈ రెండు జట్లు కూడా ఒక్కో పరాజయాన్ని అందుకున్నాయి.
ఈ నెల 24వ తేదీన ఇదే దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్ను ఎదుర్కొన్న టీమిండియా.. పరాజయాన్ని చవి చూసింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ అలవోకగా ఛేదించింది. వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఇదే పాకిస్తాన్ జట్టు తన రెండో మ్యాచ్లో న్యూజిలాండ్ను మట్టి కరిపించింది. మంగళవారం రాత్రి నాటి మ్యాచ్లో న్యూజిలాండ్పై అయిదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది పాకిస్తాన్ టీమ్.
భారత్పై విజయం సాధించిన తరువాత పాకిస్తాన్ జట్టు డ్రెస్సింగ్ రూమ్లో ఓ చిన్నస్థాయి సెలబ్రేషన్స్ను నిర్వహించింది. జట్టు సభ్యులతో పాటు కోచ్ సక్లయిన్ ముస్తాక్ ఈ సెలెబ్రేషన్స్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ప్లేయర్లను ఉద్దేశించి కేప్టెన్ బాబర్ ఆజమ్, సక్లయిన్ ముస్తాక్ స్ఫూర్తిదాయకమైన స్పీచ్ ఇచ్చారు. భారత్తో విజయం సాధించడంతోనే యుద్ధం ముగిసిపోలేదని బాబర్ ఆజమ్ చెప్పుకొచ్చాడు. తమ ప్రయాణం ఇంకా గమ్యానికి చేరుకోలేదని చెప్పాడు.
భారత్ను ఓడించడానికి తాము ఇక్కడికి రాలేదని, ఈ గెలుపు.. తమ ప్రయాణంలో ఓ మజిలీ మాత్రమేనని బాబర్ వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్ను గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించాడు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రపంచకప్ మీది నుంచి దృష్టిని మరల్చవద్దని అన్నాడు. ఈ దఫా టీ20 ప్రపంచకప్ను గెలిచిన తరువాతే అసలైన సంబరాలు చేసుకుందామని, తాను అందులో భాగస్వామిని అవుతానని బాబర్ చెప్పాడు. అప్పటిదాకా సెలబ్రేషన్స్కు దూరంగా ఉండక తప్పదని చెప్పాడు.
ప్రపంచకప్ను సాధించే క్రమంలో ఇది మొదటి అడుగుగానే భావించాలని పేర్కొన్నాడు. ఇంకా ఎదుర్కొవాల్సిన మ్యాచ్లు చాలా ఉన్నాయని, ఓవర్ ఎగ్జయిటింగ్ కావొద్దని విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ చేసే బ్యాటింగ్ చేయాల్సిందే..బౌలింగ్ చేసేవాడు బౌలింగ్ చేయాల్సిందే.. ఫీల్డింగ్లో సమష్టిగా, వందశాతం శక్తిసామర్థ్యాలను ప్రదర్శించక తప్పదని సూచించాడు. ప్రపంచకప్ను సాధించడానికి ఇదొక మంచి అవకాశమని, దీన్ని చేజార్చుకోవద్దని ముస్తాక్ చెప్పాడు.