హైదరాబాద్: భారత జాతీయ జట్టులో చోటు కోసం గత కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ దేశవాళీ టోర్నీలో రాణించాడు. ఢిల్లీ వేదికగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్లో మనన్ వోహ్రా (74), యువరాజ్ సింగ్ (50) హాఫ్ సెంచరీలతో మెరిశారు.
దీంతో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆనంతరం 171 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు ఓపెనర్లు చక్కటి శుభారంభమిచ్చారు. గౌతమ్ గంభీర్ (66), రిషబ్ పంత్ (38) తొలి వికెట్కి 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ఈ సమయంలో రిషబ్ పంత్ ఔటవగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా (29), హిమాత్ సింగ్ (6) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న గౌతమ్ గంభీర్ ఢిల్లీ జట్టుని గెలిపించేలా కనిపించాడు. అయితే జట్టు స్కోరు 157 పరుుగుల వద్ద లేని పరుగు కోసం ప్రయత్నించి ఔటయ్యాడు.
చివరి ఓవర్ ఆడిన పవన్ నేగి కనీసం ఒక బౌండరీ కూడా కొట్టేలేకపోవడం ఢిల్లీ 168/4కే పరిమితమైంది. ఇటీవలే యో-యో టెస్టు పాసైన యువరాజ్ సింగ్ దేశవాళీ క్రికెట్లో తిరిగి ఫామ్ అందుకుంటే త్వరలోనే భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అభిమానులు అంటున్నారు.
సంక్షిప్త స్కోర్లు:
పంజాబ్: 170/3 (Manan Vohra 74 off 50 balls, Yuvraj Singh 50 off 40 balls)
ఢిల్లీ: 168/4 (Gautam Gambhir 66 off 54 balls, Rishabh Pant 38 off 25 balls, Harbhajan Singh 0/31 in 4 overs). Four points for Punjab.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.