రోజు ఓ అర గంట..
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య.. తన తల్లిదండ్రులతో రోజు ఓ అరగంట మాట్లాడుతానని తెలిపాడు. ఫ్యామిలీతో గడపడం వల్ల తాను చాలా ప్రశాంతంగా ఉంటానని, వారి మాటలు తనను ఒదిగి ఉండేలా చేస్తాయని తెలిపాడు. 'నేను ఎప్పుడూ నా జోన్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తాను. నా పెళ్లాం ఎప్పుడూ నాతోనే ఉంటుంది. ఏ పర్యటనకు వెళ్లినా ఆమెను నా వెంట తెచ్చుకుంటాను. ఆఫ్ డేలో ఆమెతోనే గడుపుతాను. మ్యాచ్ లేని రోజు సరదాగా ఆమెతో బయటకు షికారుకు వెళ్తాను. ప్రతీ రోజు మా తల్లిదండ్రులతో మాట్లాడుతాను. వారు క్రికెట్ గురించి అస్సలు మాట్లాడరు. నేను ఒదిగే ఉండేలా.. ప్రశాంతతను కలిగిస్తారు. ఈ ప్రక్రియ నా లైఫ్లో రోజు జరుగుతుంది. అదే నేను నిలకడగా రాణించడానికి ఉపయోగపడుతుంది'అని సూర్య వెల్లడించాడు.
కోహ్లీతో బ్యాటింగ్..
ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో బ్యాటింగ్ చేయడం చాలా ఇష్టమని తెలిపాడు. ఒకరికొకరం గౌరవించుకొని బ్యాటింగ్ చేస్తామని చెప్పిన సూర్య.. కోహ్లీతో బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్ల మధ్య బాగా పరుగెత్తాల్సి వస్తుందన్నాడు. కోహ్లీ సూపర్ ఫిట్గా ఉంటాడని, అతనిలా పరుగెత్తడం చాలా కష్టమని తెలిపాడు. ఇక తన ఇన్నింగ్స్పై విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ను గొప్ప ప్రశంసగా తీసుకుంటానని, తన ఆటను మరింత మెరుగుపరుచుకుంటానని తెలిపాడు. ఇక సూర్య వరల్డ్ బెస్ట్ బ్యాటరని మరోసారి నిరూపించాడని, వీడియో గేమ్లా చెలరేగాడని కోహ్లీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
హార్దిక్ సూచనలతోనే..
సెంచరీ అనంతరం మాట్లాడిన సూర్య.. ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాలని కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆదేశించాడని, తాను పాటించానని చెప్పుకొచ్చాడు. 'టీ20ల్లో సెంచరీ ఎప్పుడూ ప్రత్యేకమే. కానీ జట్టుకు కావాల్సిన కీలక సమయంలో ఈ సెంచరీ చేయడంతో మరింత సంతోషాన్నిచ్చింది. నేను ఇన్నింగ్స్ చివరి వరకు ఆడాలని నిర్ణయించుకున్నాను. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా నాతో ఇదే చెప్పాడు. 18, 19వ ఓవర్ వరకు బ్యాటింగ్ చేయాలని, జట్టు స్కోర్ 185 పరుగులు ధాటించాలని చెప్పాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ ముగిసిన వెంటనే చివరి వరకు క్రీజులో ఉండాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. చివరి కొన్ని ఓవర్లను మాకు అనుకూలంగా మలుచుకోవడం చాలా ముఖ్యం. ఓవర్ ఓవర్కు పరుగులు రాబట్టం. నెట్స్లో దంచికొట్టినట్లే.. ఈ మ్యాచ్లో ఆడాను.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
సూర్య సూపర్ రికార్డులు..
ఈ ఇన్నింగ్స్తో సూర్య తన పేరిట పలు రికార్డులను లిఖించుకున్నాడు. న్యూజిలాండ్తో మ్యాచ్ 11 ఫోర్లు, 7 సిక్సులు బాదిన సూర్య.. 200కిపైగా సగటుతో పరుగులు రాబట్టాడు. ఏడో ఫోర్ బాదగానే.. ఈ క్యాలెండర్ ఇయర్లో 100 బౌండరీలను పూర్తి చేసుకున్నాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20ల్లో సూర్య 11 హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. 2021లో 13 హాఫ్ సెంచరీలు చేసిన రిజ్వాన్ మాత్రమే సూర్య కంటే ముందున్నాడు. 2021లో బాబర్ ఆజమ్ పది హాఫ్ సెంచరీలు చేయగా.. ఈ ఏడాది రిజ్వాన్ ఇప్పటి వరకూ 10 అర్ధ శతకాలు నమోదు చేశాడు.