హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని తహతహలాడి ఏడాది నిరీక్షణ తర్వాత జట్టులోకి వచ్చిన సురేశ్ రైనా తన స్థానం నిలుపుకునేందుకు చేసిన కృషి ఫలించినట్లుగానే అనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్లో మిడిలార్డర్ బ్యాట్స్మెన్ సురేశ్ రైనా కేవలం 27 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. వీటిలో 5 ఫోర్లు, 1 సిక్సు ఉండటం విశేషం.
వ్యక్తిగత ప్రదర్శనే కాకుండా భాగస్వామ్యంలో సైతం ఓపెనర్ శిఖర్ ధావన్ (47)తో కలిసి రెండో వికెట్కి 65 పరుగులు చేశాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టపోయి సఫారీలకు 173పరుగుల విజయ లక్ష్యాన్ని ఇచ్చింది.
ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ ఔటవడంతో క్రీజులోకి వచ్చిన సురేశ్ రైనా.. ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్గా మలిచి తన ఉద్దేశం చాటాడు. తర్వాత వచ్చిన జేపీ డుమిని బౌలింగ్లో ఒక ఫోర్ కొట్టిన ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్.. ఐదో ఓవర్ వేసిన అండిలే బౌలింగ్లో వరుసగా రెండు ఫోర్లు బాదేశాడు.
రైనా క్రీజులో ఉన్నంతసేపూ శిఖర్ ధావన్ కనీసం ఒక ఫోర్ కూడా కొట్టలేకపోయినా.. భారత్ మెరుగైన స్కోరు సాధించిందంటే కారణం ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ హిట్టింగే..! ఛేదనలో దక్షిణాఫ్రికా 165/6కే పరిమితమవగా.. మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సురేశ్ రైనాకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది.