అసంతృప్తిలో మూడు జట్లు:
'ఐపీఎల్ 2021 వేదికలపై బీసీసీఐ నిర్ణయం మా మూడు జట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సొంతగడ్డపై సత్తాచాటుతున్న జట్లే ఐపీఎల్లో రాణిస్తున్నాయి. సొంతగడ్డపై ఐదు లేదా ఆరు విజయాలు నమోదు చేస్తూ.. ప్లేఆఫ్కు దూసుకెళ్తున్నాయి. బీసీసీఐ నిర్ణయంతో బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై జట్లకు స్థానిక అనుకూలత లభిస్తుంది. మేం మాత్రం అన్ని మ్యాచ్ల్ని బయటే ఆడాల్సి ఉంటుంది. ఇది మాకు నష్టం కలిగించే అంశం' అని ఒక ఫ్రాంచైజీ అధికారి పేర్కొన్నారు. ఏ ఫ్రాంచైజీకి సొంతగడ్డ కాని అహ్మదాబాద్ను వేదికగా ఎంపిక చేయడంపై మూడు జట్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తున్నాయి.
హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించాలంటూ:
వేదికల ఎంపికపై తమ అభ్యంతరాల్ని హైదరాబాద్, రాజస్థాన్, పంజాబ్ ఫ్రాంచైజీలు విడివిడిగా బీసీసీఐ సీఈఓ హేమంగ్ అమిన్ దృష్టికి తీసుకెళ్లాయి. వేదికలపై బోర్డు పునరాలోచించాలంటూ మూడు ఫ్రాంచైజీలు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని కూడా భావిస్తున్నాయి. త్వరలోనే ఫిర్యాదు చేయనున్నాయని సమాచారం. ఐపీఎల్ 2021 ఆతిథ్యం కోసం ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటం, కరోనా రెండో దశ ప్రభావం కనిపిస్తుండటాన్ని మూడు ఫ్రాంచైజీలు ఎత్తిచూపుతున్నాయి. ఎన్నికలు లేని, కరోనా ప్రభావం తక్కువగా ఉన్న హైదరాబాద్లో మ్యాచ్లు నిర్వహించాలంటూ సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంచైజీ పట్టుబడుతుంది. అన్ని అనుకూలంగా ఉన్న హైదరాబాద్లో మ్యాచ్లు ఎందుకు నిర్వహించరు అని ప్రశ్నిస్తోంది.
బుజ్జగించే పనిలో బీసీసీఐ:
అయితే వేదికల విషయంలో బీసీసీఐ మాత్రం మూడు ఫ్రాంచైజీలను బుజ్జగించే పనిలో పడిందట. కరోనా పరిస్థితుల దృష్ట్యా తాము నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఫ్రాంచైజీలకు చెప్తోంది. గత ఐపీఎల్ను యూఏఈలో నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తోంది. అయితే అన్ని జట్లకు యూఏఈ తటస్థ వేదిక కాబట్టి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఫ్రాంచైజీలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు 5 జట్లు సొంతగడ్డపై ఆడటం తమ అవకాశాల్ని ప్రభావితం చేస్తాయని కొన్ని ఫ్రాంచైజీలు ఆందోళన చెందుతున్నాయి. క్రికెటే కాకుండా వ్యాపార పరంగానూ తమకు నష్టమే అని చెపుతున్నాయి. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ముంబైని తప్పిస్తే:
ఆరు వేదికల నుంచి ముంబైని బీసీసీఐ తప్పించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్రలో గత కొద్దిరోజుల నుంచి కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా పెరగడమే అందుకు ప్రధాన కారణం. ఒకవేళ ముంబైని తప్పిస్తే.. అప్పుడు రేసులో హైదరాబాద్, జైపూర్, మొహాలి నిలిచే అవకాశం ఉంది. ఆటగాళ్ల ప్రయాణం, ఆతిథ్యం పరంగా చూసుకుంటే.. జైపూర్, మొహాలి కంటే హైదరాబాద్ ముందు నిలిచే అవకాశం ఉంది.