న్యూ ఢిల్లీ: జట్టు సభ్యుల ఆరోపణల అనంతరం రాజీనామా చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ తుషార్ అరోతె స్థానంలో.. మాజీ టీమ్ఇండియా స్పిన్నర్ సునీల్ జోషి నిలవనున్నాడు. రేసులో నిలిచాడు. భారత్ తరఫున 15 టెస్టులు, 69 వన్డేలు ఆడిన జోషికి కోచ్గా కూడా అనుభవం ఉంది. అతను అంతర్జాతీయ స్థాయిలో బంగ్లాదేశ్, ఒమన్లతో పాటు దేశవాళీ క్రికెట్లో హైదరాబాద్, జమ్ము కశ్మీర్, అసోం జట్లకు కోచ్గా పని చేశాడు.
మాజీ ఆఫ్స్పిన్నర్ రమేశ్ పొవార్ కూడా కోచ్ రేసులో ఉన్నాడు. వీళ్లిద్దరితో పాటు 20 మంది ఈ కోచ్ పదవికి దరఖాస్తులు చేసుకున్నారు. వీరికి శుక్రవారం ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు. అజయ్ రాత్రా, విజయ్ యాదవ్, మమతా మాబెన్, సుమన్శర్మ కూడా జాబితాలో ఉన్నారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ మారియ ఫహె కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసింది.
స్టార్ క్రీడాకారిణులతో తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తిన కారణంగా అతడు రాజీనామా చేశాడు. అతడి శిక్షణ పద్ధతులపై మహిళా క్రికెటర్లు నిరసన వ్యక్తం చేశారు. 'తుషార్ రాజీనామాను బీసీసీఐ ఆమోదించింది. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అతడు చెప్పాడు' అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఐతే కొందరు సీనియర్ ప్లేయర్లు తుషార్ను తప్పించాలని డిమాండ్ చేశారని, ఆ నేపథ్యంలో అతడు రాజీనామా చేశాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.
మరో కొద్ది నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కోచ్ తుషార్ రాజీనామా చేయడం చర్చనీయంగా మారింది. అయితే.. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేసినట్లు తుషార్ చెబుతున్నప్పటికీ కొంతమంది జట్టు సభ్యుల ప్రవర్తన తీరు వల్లే ఆయన అలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి.
కొంత మంది క్రీడాకారిణులు ప్రవర్తన మార్చుకోకపోవడం వల్ల జట్టు తీవ్రంగా నష్టపోతోందని తుషార్ ఆవేదన. దాన్ని సరిచేయడానికి ప్రయత్నించి విఫలమవడంతో చేసేదేంలేక ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. తన నిర్ణయానికి ఎవరూ కారణం కాదని, తనకు ఎవరి పట్ల ద్వేషంగానీ, కోపంగానీ లేవని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జట్టు సభ్యుల సహకారం, సమష్టి కృషి వల్లే పలు విజయాలు సాధించడం సాధ్యమైందని ఆయన చెప్పారు.