బాహాటంగానే ప్రకటించిన కోహ్లీ
భారత్ నుంచి ఈ పర్యటనకి వెళ్లే ముందు దూకుడుగా కనిపించే కెప్టెన్ విరాట్ కోహ్లి.. మైదానంలో తాము హద్దులు దాటబోమని బాహాటంగా ప్రకటించాడు. కానీ, వారు హద్దుల్లో ఉన్నంతవరకే. ఒకసారి నియంత్రణ కోల్పోతే మాత్రం మేము అదే స్థాయిలో సమాధానం ఇస్తామంటూ మాటిచ్చాడు. మరోవైపు ఆస్ట్రేలియా కూడా తామూ నియంత్రణలోనే ఉంటామని చెప్పుకొస్తోంది.
ఆసీస్ ఆటగాళ్లు కవ్వింపులకేం తక్కువ కాదు
కానీ.. మైదానంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు కవ్వింపులకి దిగడం పరిపాటేనని తాజాగా భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు. ఆసీస్ ఆటగాళ్లు హద్దులు దాటైనా సరే మ్యాచ్ గెలవాలనే కాంక్ష వారి నరనరాల్లో ఉంటుందని జీర్ణించుకుపోయిందని వివరించాడు. ఇలాంటి తలంపుతోనే దక్షిణాఫ్రికా గడ్డపై బాల్ టాంపరింగ్కి పాల్పడి స్టీవ్స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్క్రాప్ట్ నిషేధానికి గురైన విషయం తెలిసిందే.
ఆసీస్ జట్టులో మార్పు లేదు
‘సుదీర్ఘకాలంగా అన్ని మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా జట్టు వ్యవహారశైలిలో మార్పు కనిపించడం లేదు. మిగతా వాటితో పోలిస్తే.. ఆసీస్ గెలవాలని చూసే తీరు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. మైదానంలో నిబంధనలకి లోబడి ఆడటం, వాటిని అతిక్రమించడం మధ్య చిన్నపాటి హద్దు ఉంటుంది. కానీ.. ఆస్ట్రేలియా జట్టు మాత్రం ఇప్పటి వరకు అలాంటివేమీ పట్టించుకున్నట్లు కనిపించడంలేదని జరిగిన పరిణామాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో.. క్రీడా స్ఫూర్తికి కూడా విలువివ్వడం లేదు.'
హద్దులు గురించి తెలీకుండానే
'ఇప్పుడేమో.. భారత్పై సిరీస్లో ఆసీస్ హద్దుమీరమని చెప్పుకొస్తున్నారు. వారికి అసలు వాటి గురించే తెలీదు. ఎలా అంటే.. మన దేశ సరిహద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్లా..!' అని గవాస్కర్ వెల్లడించాడు. భారత్, ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.