
హైదరాబాద్: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తమిళనాడుతో జరిగిన విజయ్ హాజారే ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక విజయం సాధించింది. ఫలితంగా విజయ్ హాజారే ట్రోఫీని కర్ణాటక 4వసారి కైవసం చేసుకుంది. తమిళనాడు నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో కర్ణాటక ఇన్నింగ్స్కు వరుణుడు అంతరాయం కలిగించాడు.
వర్షంతో మ్యాచ్ నిలిచిపోయే సమయానికి కర్ణాటక 23 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 146 పరుగులు చేసింది. అయితే, వీజేడీ పద్ధతి(వి జయవర్దనే) ద్వారా కర్ణాటక గెలిచినట్లు అంఫైర్లు ప్రకటించారు. వీజేడీ పద్ధతితో స్కోరు లెక్కిస్తే కర్ణాటక జట్టు 87 పరుగుల ముందంజలో ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్(52), మయాంక్ అగర్వాల్ (69) పరుగులతో ఉన్నారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కర్ణాటక కెప్టెన్ మనీష్ పాండే తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కర్ణాటక బౌలర్ అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ తీయడంతో 49.5 ఓవర్లలో 252 పరుగులకు కుప్పకూలింది. తమిళనాడు బ్యాట్స్మెన్లలో ఓపెనర్ అభినవ్ ముకుంద్ (85), బాబా అపరజిత్ (66) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు.
ఈ టోర్నీలో తమిళనాడు తరుపున ఆడుతోన్న భారత ఆటగాళ్లు మురళీ విజయ్, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ నిరాశపరిచారు. కర్ణాటక బౌలర్లలో అభిమన్యు మొత్తం 5 వికెట్లతో చెలరేగగా... వి కౌశిక్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కర్ణాటక బౌలర్లు తమిళనాడుకు ఆరంభంలోనే షాకిచ్చారు.
మొదటి ఓవర్లోనే ఓపెనర్ మురళీ విజయ్ (0)ని పేసర్ మిథున్ పెవిలియన్కు చేర్చాడు. మరో ఓపెనర్ అభినవ్ ముకుంద్ మాత్రం నిలకడగా ఆడాడు. అయితే వన్డౌన్లో వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 24 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి తమిళనాడు కష్టాల్లో పడింది.
ఈ దశలో క్రీజులోకి వచ్చిన అపరాజిత్.. అభినవ్కుమంచి సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో వీరిద్దరూ హాఫ్ సెంచరీలు సాధించారు. వీరిద్దరూ వందకుపైగా భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత అభినవ్ పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత కొద్దిసేపటికే అపరజిత్ కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విజయ శంకర్ దూకుడుగా ఆడాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో కెప్టెన్ దినేష్ కార్తీక్ (11), విజయ్ శంకర్(38) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. చివరలో షారుఖ్ ఖాన్ (27), మహ్మద్ (10) ధాటిగా ఆడారు. చివరి ఓవర్లో అభిమన్యు మిథున్ హ్యాట్రిక్ తీయడంతో తమిళనాడు 252 పరుగులకే ఆలౌటైంది.