
హైదరాబాద్: యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో సంచలనం నమోదైంది. ఆసియా కప్ టోర్నీలో అత్యంత ఘన చరిత్ర కలిగిన శ్రీలంక ఈసారి టోర్నీ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో 137 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
రెండో మ్యాచ్లో పసికూన ఆప్ఘనిస్థాన్ చేతిలో ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా సోమవారం అబుదాబి వేదికగా శ్రీలంక-ఆప్ఘనిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ టాపార్డర్అద్భుతంగా ఆడడంతో అఫ్ఘాన్ 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.
రహమత్ షా(72) హాఫ్ సెంచరీతో మెరవగా ఇహ్సానుల్లా జనత్(45) ఫరవాలేదనిపించాడు. అనంతరం 250 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన లంక 41.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. దీంతో శ్రీలంక జట్టు 91 పరుగుల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో ఆసియా కప్లో శ్రీలంక కథ ముగిసింది. ఆసియా కప్ టోర్నీలో ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన శ్రీలంక గ్రూప్ స్టేజిలోనే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. అంతేకాదు ఇదే టోర్నీలో పాల్గొంటున్న టీమిండియా ఇంకా తన తొలి మ్యాచ్ని ఆడటానికి ముందే శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించడం అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది.