ఏసీసీ వీడియో కాన్ఫరెన్స్:
ఆసియా కప్ టోర్నీ నిర్వహణపై చర్చించేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సాధ్యాసాధ్యాలపై చర్చించింది. ఆసియా కప్ 2020ను ఎక్కడ నిర్వహించాలనే దానిపైనా సమావేశంలో చర్చించామని ఏసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా ఈ సమావేశానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి జైషా తొలిసారి హాజరయ్యారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ సిల్వా కూడా పాల్గొన్నాడు.
శ్రీలంకలో ఆసియా కప్?:
సమావేశం అనంతరం సిల్వా మాట్లాడుతూ... శ్రీలంకలో ఆసియా కప్ 2020ని నిర్వహించుకునేందుకు పాక్ పర్మీషన్ ఇచ్చినట్లు వెల్లడించాడు. ఇక సమావేశంలో ఉన్న సౌరవ్ గంగూలీ.. ఆ సమయంలో మౌనంగా ఉండటంతో శ్రీలంకలో ఆసియా కప్ని ఆడేందుకు భారత్కి ఎలాంటి అభ్యంతరం లేదని తెలుస్తోంది. ఒకవేళ ఆసియా కప్లో భారత్ ఆడకుండా ఉంటే.. ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి ఉంటుందని భావించిన పాకిస్థాన్ కూడా ఏం మాట్లాడకుండా ఉందట.
తుది నిర్ణయం త్వరలోనే:
ఈ సమావేశంలో టోర్నీ నిర్వహణ ప్రాముఖ్యతను సభ్య దేశాలకు బోర్డు వివరించిందని, ప్రస్తుత వైరస్ పరిస్థితుల్లో ఎక్కడ, ఎలా నిర్వహించాలనే దానిపై చర్చించామని ఏసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం మాత్రం త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది. ఏసీసీ అధ్యక్షుడు నజ్ముల్ హసన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ప్రస్తుత స్థితిగతులపై కౌన్సిల్ సంతృప్తికరంగా ఉందని సమాచారం. ఈసారి ఆసియా కప్ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టీ20 ఫార్మాట్లో నిర్వహించాల్సి ఉంది.
తటస్థ వేదికపై నిర్వహిస్తేనే:
2018లో బీసీసీఐ ఆసియా కప్ను నిర్వహించినప్పుడు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే ఆడుతాం అని పాక్ బోర్డు అంది. దీంతో ఆ మెగా ఈవెంట్ను యూఏఈలో నిర్వహించారు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ఇండియా ఫైనల్లో బంగ్లాను ఓడించి టైటిల్ సాధించింది. ఇప్పుడు తటస్థ వేదికపై నిర్వహిస్తేనే టీమ్ఇండియాను అనుమతిస్తామని బీసీసీఐ ఇదివరకే వెల్లడించింది. దీంతో పాక్ వెనకుగుడువేస్తోంది.