కేంద్ర క్రీడల మంత్రిని కలిసిన భజరంగ్ పూనియా
ఈ అంశంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను పూనియా శుక్రవారం కలిశాడు. "నేను ఈ రోజున మంత్రిని కలుసుకోవాల్సి వచ్చింది. ఖేల్ రత్న కోసం నన్ను పరిగణించని కారణమేంటని నేను మంత్రిని అడిగాను. నామినేట్ చేయబడిన ఇద్దరు (కోహ్లీ, మీరాబాయి చాను) కంటే ఎక్కువ పాయింట్లను నేను సంపాదించాను" అని భజరంగ్ తెలిపాడు.
|
కోహ్లీకి ఖేల్ రత్న అవార్డు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే
అయితే, కోహ్లీ, మీరాబాయి చానులకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ తన అధికారిక ట్విటర్లోఈ వివరణ ఇచ్చింది. రాజీవ్ ఖేల్రత్న అవార్డు ఎంపిక ప్రక్రియను రెజ్లర్ భజరంగ్ పూనియా ప్రశ్నిస్తున్నాడంటూ ఎన్డీటీవీ రాసిన ఓ కథనంపై క్రీడాశాఖ స్పందించింది. "ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో రెండింట్లో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక, మీరాబాయి చాను వెయిట్లిఫ్టింగ్లో ప్రస్తుతం వరల్డ్ చాంపియన్గా ఉంది" అని క్రీడాశాఖ ఆ ట్వీట్లో వెల్లడించింది.
తనకు అవార్డు దక్కకపోవడంపై పూనియా అసంతృప్తి
అవార్డు ఎంపిక ప్రక్రియలో 11 మంది సభ్యుల ప్యానెల్ భజరంగ్ పూనియాకు 80 పాయింట్లు ఇచ్చింది. విరాట్ కోహ్లీకి ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. అయినా తనకు అవార్డు దక్కకపోవడంపై పూనియా అసంతృప్తి వ్యక్తం చేశాడు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన చేస్తున్న భజరంగ్ గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్తో పాటు..2 018 ఆసియా గేమ్స్లో బంగారు పతకాలు సాధించి భారత దేశానికే గర్వకారణంగా నిలిచాడు.
సెప్టెంబర్ 25న రాష్ట్రపతి భవన్లో కార్యక్రమం
2014 కామన్వెల్త్ గేమ్స్తో పాటు, 2014 ఆసియా క్రీడల్లోనూ బజరంగ్ రజత పతకాలు సాధించాడు. ఈ పురస్కారాలను సెప్టెంబర్ 25న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోనున్నారు. అవార్డుతో పాటు ఖేల్ రత్న అవార్డు గ్రహీతలకు రూ. 7.5 లక్షలు, అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్చంద్ అవార్డు గ్రహీతలకు రూ. 5లక్షల చొప్పున నగదు బహుమతి అందిస్తోంది.