పొల్లాక్ మాట్లాడుతూ
పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో పొల్లాక్ మాట్లాడుతూ "జట్టుకు అందుబాటులో ఎక్కువ మంది ఉంటే బాగుంటుంది. కానీ, కౌంటీ క్రికెట్ ఆడకుండా అడ్డుకోవడం మాత్రం కష్టం. గతంలో ఆడితే ఎక్కువ డబ్బులు వచ్చేవి కావు. జాతీయ జట్టుకు ఎక్కువ మంది అందుబాటులో ఉండేవారు. ఇప్పుడంతా వ్యాపారమే" అని అన్నాడు.
డబ్బు సంపాదించేందుకు
"ఆటగాళ్లు వ్యాపార నిర్ణయాలు తీసుకుంటున్నారు. డబ్బు సంపాదించేందుకు అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. దక్షిణాఫ్రికాకు ఆడలేమని తెలిసినప్పుడు ఇతర మార్గాలు వెతుక్కుంటున్నారు. ఇది నిరాశ కలిగించే అంశం. ఇది సరైంది కాదు. ఆటగాళ్లు అందరూ ఉన్నప్పుడే జట్టు బలంగా ఉంటుంది" అని పొల్లాక్ పేర్కొన్నాడు.
రాత్రికి రాత్రే జరగదు
"గత కొన్నేళ్లలో కొంతమంది స్టార్ ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. ఏబీ డివిలియర్స్, ఆమ్లా, స్టెయిన్ వంటి దిగ్గజాల స్థానాలను భర్తీచేయడం రాత్రికి రాత్రే జరగదు. వారి లోటు తీర్చడం కష్టం. విశాఖ టెస్టులో సఫారీలు పోరాడతారని తెలుసు. అయితే ఎంతవరకు విజయవంతం అవుతారో తెలీదు" అని పొల్లాక్ అన్నాడు.
మిగతా ఆటగాళ్లు భారత్లో ఆడలేదు
"డీన్ ఎల్గర్, కెప్టెన్ డుప్లెసిస్ రాణిస్తారని అనుకున్నా. జట్టులోని మిగతా ఆటగాళ్లు భారత్లో ఆడలేదు. వారి నుంచి ఎక్కువ ఆశించడం సరైంది కాదు. ఫిలాండర్ను మినహాయిస్తే రబాడ సహా మిగతా పేసర్లు ప్రభావం చూపలేకపోతున్నారు" అని పొల్లాక్ చెప్పుకొచ్చాడు.