తొలి ప్రపంచకప్:
1983లో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ తొలిసారిగా ప్రపంచకప్ ముద్దాడింది. మళ్లీ 28 ఏళ్ల తరువాత ఎంఎస్ ధోనీ (2011 ప్రపంచకప్) కప్ అందించాడు. సౌరవ్ గుంగూలీ సారథ్యంలో 2003 ప్రపంచకప్లో భారత్ ఫైనల్ చేరినా.. ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. అనంతరం రాహుల్ ద్రవిడ్ 2006, 2007లో వెస్టిండీస్, ఇంగ్లాండ్ లలో టెస్ట్ సిరీస్ గెలిపించి భారత ఖ్యాతిని పెంచాడు. కానీ 2007 ప్రపంచకప్లో మాత్రం ద్రవిడ్.. సారథ్యంలో విఫలమయ్యాడు.
ధోనీ వారసత్వం కొనసాగించేనా? :
ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న కోహ్లీ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. టెస్ట్, వన్డే, టీ20లలో టీమిండియాను మంచి స్థితిలో నిలిపాడు. ముఖ్యంగా ఆదిలోనే విదేశీ గడ్డపై టెస్ట్ విజయాలు సాధించడంతో కోహ్లీకి తిరుగులేకుండా పోయింది. మరోవైపు జట్టుకు విలువైన పరుగులు చేస్తూ.. 'రన్ మిషెన్'గా పేరుగాంచాడు. ప్రస్తుతం జట్టు అత్యంత పటిష్టంగా ఉంది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. టీంఇండియా కప్ గెలవడానికి ఇదే మంచి అవకాశం. కప్ గెలిచి ధోనీ వారసత్వాన్ని కోహ్లీ కొనసాగించనున్నాడు.
సవాలుతో కూడుకున్న టోర్నీ:
తాజాగా కోహ్లీ మాట్లాడుతూ... '2015 ప్రపంచకప్ ఆడుతున్నప్పుడు ఈ ప్రపంచకప్ గురించి ఆలోచించలేదు. ఎందుకంటే చాలా సమయం ఉంది. ప్రపంచకప్లో ఆడడం ప్రత్యేకమైన అనుభూతి. ఎప్పటికీ గుర్తించుకోదగిన విషయం. ఇది చాలా పెద్ద టోర్నీ, తొమ్మిది మ్యాచులు ఆడడం ప్రతి కెప్టెన్కు కష్టమే. నాకు కూడా. ఇది చాలా సవాలుతో కూడుకున్న టోర్నీ' అని కోహ్లీ తెలిపారు.
అంచనాలు ఉండడం సహజమే:
2011, 2015 ప్రపంచకప్ తొలి మ్యాచ్ల్లో కోహ్లీ సెంచరీలు సాధించాడు. మరి మూడోసారి కూడా సెంచరీ చేస్తారా అనే ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. 'నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అంచనాలు ఉండడం సహజమే. వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు. క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ నా నుంచి సెంచరీ ఆశిస్తారనేది వాస్తవమే. కానీ ఇదంతా ఆటలో భాగంగానే చూస్తా' అని కోహ్లీ అన్నారు.
మరింత పటిష్టంగా ఉన్నాం:
'2017 చాంపియన్స్ ట్రోఫీ చాలా గుణపాఠాలు నేర్పింది. ఎలా ఆడాలో తెలుసుకున్నాం. ఫైనల్లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చిన జట్టే విజయం సాధిస్తుంది. జట్టులోని లోపాలపై దృష్టి పెట్టాం. చాంపియన్స్ ట్రోఫీ అనంతరం జట్టులో కొన్ని మార్పులు జరిగాయి. మధ్య ఓవర్లలో వికెట్లు తీసేందుకు స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ జట్టులోకి వచ్చారు. అప్పటి జట్టుతో పోలిస్తే ఇప్పుడు మేం మరింత బలంగా ఉన్నాం' అని కోహ్లీ పేర్కొన్నాడు.