న్యూఢిల్లీ: 2004 పాకిస్థాన్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని జాతీయ జట్టులోకి తీసుకోవడానికి భారత కెప్టెన్గా సౌరవ్ గంగూలీ చాలా ప్రయత్నించాడని అప్పటి కోచ్ జాన్ రైట్ తెలిపాడు. గంగూలీ ఆసక్తి చూపినా.. ఆ టూర్కు ధోనీ ఎంపికవలేదని ఆయన చెప్పాడు. మూడు టెస్టుల సిరీస్కు మరో వికెట్ కీపర్, బ్యాట్స్మన్ పార్థీవ్ పటేల్ను ఎంపిక చేశారు. 2004 పాకిస్థాన్ పర్యటనలో టెస్టుల్లో పార్థీవ్ కీపింగ్ చేయగా.. వన్డేల్లో మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ చేశాడు.
'2004లో పాకిస్థాన్ పర్యటనలో ఎంఎస్ ధోనీని జట్టులో చేర్చుకోవడానికి అప్పటి సారథి సౌరవ్ గంగూలీ చాలా ఆసక్తి చూపించాడు. మేము విజయవంతమైన టెస్టు జట్టును ఎన్నుకున్నాం. దాదాపు ధోనీ ఎంపికయ్యాడు. అయితే తుది నిర్ణయం మరోలా జరిగింది. ధోనీ లేకుండానే జట్టును ఎంపిక చేశాం' అని జాన్ రైట్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. జాతీయ జట్టు కోసం ఎప్పుడు చర్చ వచ్చినా ధోనీ గురించి దాదా ఎంతో బాగా చెప్పేవాడన్నాడు.
'బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీలో మంచి విషయాలు చాలా ఉన్నాయి. జట్టు ఎంపిక సమయంలో అతడు యువకులకు ఎప్పుడూ ప్రోత్సహించేవాడు. ప్రతిభ గల ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా ఉండేవాడు. ఎంఎస్ ధోనీ పాకిస్థాన్ పర్యటనకు ఎంపిక చేయబడి ఉంటే.. ఆ తర్వాతి పరిస్థితులు ఎలా ఉండేవో మీకు తెలియదు. అది నేను అతని గురించి మొదటగా వినడం ప్రారంభించినప్పుడు' అంటూ రైట్ గుర్తుచేసుకున్నాడు.
'మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు చాలా తెలివైన వాడు కూడా. ఎదుటివాళ్లు చెప్పేదాన్ని జాగ్రత్తగా వినేవాడు. తన ఫస్ట్ సిరీస్లో పెద్దగా ఏమీ చెప్పలేదు. కానీ అన్ని సమయాల్లోనూ ప్రతి విషయాన్ని గమనిస్తూ నేర్చుకున్నాడు. అతనికి మంచి భవిష్యత్ ఉందని నేను ఆ సమయంలోనే అనుకున్నా' అని టీమిండియా మాజీ కోచ్ పేర్కొన్నాడు.
2004 డిసెంబర్లో బంగ్లాదేశ్తో వన్డే ద్వారా ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మొదటలో విఫలమైనా.. విశాఖ ఇన్నింగ్స్తో తన పేరు ప్రపంచానికి తెలియజేశాడు. ఆ తర్వాత బ్యాట్స్మన్, కీపర్, కెప్టెన్గా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టాడు. అంతేకాదు భారత్కు రెండు ప్రపంచకప్లను అందించాడు. మహీ గత నెల అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
Commentary Panel: సంజయ్ మంజ్రేకర్కు షాక్.. ఐపీఎల్ 2020లో దక్కని చోటు!!