
హైదరాబాద్: ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో గురువారం జరిగిన తొలి వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్లో స్మృతి మంధాన 104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 105 పరుగులతో సెంచరీ సాధించింది. ఫలితంగా కివీస్ గడ్డపై సెంచరీ సాధించిన రెండో భారత మహిళా క్రికెటర్గా అరుదైన ఘనత సాధించింది.
మరోవైపు న్యూజిలాండ్ పర్యటనలో తొలి వన్డేలో సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ విరాట్ కోహ్లీల సరసన నిలిచింది. అంతకముందు న్యూజిలాండ్ గడ్డపై తొలి వన్డేలో సెంచరీ సాధించిన భారత ఆటగాళ్లుగా మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలు ఉన్నారు.
తాజాగా ఈ జాబితాలోకి స్మృతి మంధాన చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 192 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో ఏక్తాబిస్త్, పూనమ్ యాదవ్లు తలో మూడు వికెట్లు తీయగా, దీప్తి శర్మ రెండు, శిఖా పాండేకు ఒక వికెట్ లభించింది.
అనంతరం న్యూజిలాండ్ జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళల జట్టు 33 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన(105; 104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా... రోడ్రిగ్స్(81 నాటౌట్; 94 బంతుల్లో 9 ఫోర్లు) సాయంతో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నారు.
మ్యాచ్ అనంతరం మంధాన మాట్లాడుతూ "సెంచరీ సాధించడం చాలా ఆనందంగా ఉంది. గత కొద్దిరోజులుగా నేను 70, 80 స్కోర్లలో వికెట్ చేజార్చుకుంటూ వస్తున్నాను. బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎలాంటి పేలవ షాట్లు, లాప్టెడ్ షాట్లు ఆడకూడదని నాకు నేను చెప్పుకున్నా. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్కే పరిమితమయ్యా. మూడంకెల స్కోరు చేసి జట్టుని గెలిపించడం అదో మధురానుభూతి. బుధవారం పురుషుల వన్డే చూడటం ద్వారా.. నేపియర్ పిచ్లో బంతి స్పందిస్తున్న తీరుపై అవగాహన తెచ్చుకున్నా. అదే నాకు ఈరోజు కలిసొచ్చింది" అని వెల్లడించింది.