ఈస్ట్ లండన్(సౌతాఫ్రికా): టీ20 ప్రపంచకప్ ముందు భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సౌతాఫ్రికా గడ్డపై జరుగుతున్న ట్రై సిరీస్లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఓపెనర్ స్మృతి మంధాన (51 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 74 నాటౌట్), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ( 35 బంతుల్లో 8 ఫోర్లతో 56 నాటౌట్) అజేయ అర్ధసెంచరీలతో అదరగొట్టడంతో వెస్టిండీస్ జట్టుపై విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో సమష్టిగా రాణించిన భారత్ 56 పరుగుల తేడాతో వెస్టిండీస్ను చిత్తుచేసింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 167 పరుగులు సాధించింది. స్మృతి, హర్మన్ మూడో వికెట్కు అజేయంగా 115 పరుగులు జోడించారు. అనంతరం వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. షెమైన్ క్యాంప్బెల్ (57 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 47;), కెప్టెన్ హేలీ మాథ్యూస్ (29 బంతుల్లో 5 ఫోర్లతో 34 నాటౌట్) పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ (2/29), రాజేశ్వరి గైక్వాడ్ (1/16), రాధ యాదవ్ (1/10) రాణించారు.
భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. తొలి మ్యాచ్లో భారత్.. సౌతాఫ్రికాపై విజయం సాధించిన విషయం తెలసిందే. ఈ సిరీస్లో భారత్ తమ తదుపరి మ్యాచ్లను జనవరి 28న సౌతాఫ్రికాతో, జనవరి 30న వెస్టిండీస్తో ఆడనుంది. టాప్-2లో నిలిచిన రెండు జట్లు ఫిబ్రవరి 2న ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాయి.
ఈ సిరీస్ అనంతరం ఫిబ్రవరి 10 నుంచి మహిళల టీ20 ప్రపంచకప్ సౌతాఫ్రికా వేదికగానే జరగనుంది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడాలనే భారత అమ్మాయి నెల రోజుల ముందుగా అక్కడికి వెళ్లి ట్రై సిరీస్ ఆడుతున్నారు. ప్రపంచకప్ ముందు ఈ ట్రై సిరీస్ నెగ్గి తమ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని భారత జట్టు భావిస్తోంది.