ముంబై: అమ్మాయిల కోసం అయిదారు జట్లతో కూడిన పూర్తిస్థాయి ఐపీఎల్ నిర్వహించాలని భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. దేశంలో పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్ నిర్వహించడం వల్ల ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ టోర్నీలలో భారత జట్టు మరింత సత్తా చాటే అవకాశముంటుందన్నారు. మహిళల ఐపీఎల్కు బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలను ఆమె స్వాగతించారు.
సరిగా నిద్ర పట్టడం లేదు.. నా కొడుకు షోయబ్ను ఎప్పుడు చూస్తాడో: సానియా
'మహిళల ఐపీఎల్ దిశగా బీసీసీఐ గొప్ప ప్రయత్నాలే చేస్తోంది. రెండేళ్ల క్రితం తొలిసారి ఎగ్జిబిషన్ మ్యాచ్ల తరహాలో అమ్మాయిల ఐపీఎల్ నిర్వహించారు. గతేడాది మూడు జట్లతో లీగ్ను మరింత విజయవంతంగా నిర్వహించారు. ఈ ఏడాది నాలుగు జట్లతో నిర్వహించాలనుకున్నారు. ఏడాది లేదా రెండేళ్లలో ఐపీఎల్ తరహాలో అమ్మాయిల మ్యాచ్లు ఎక్కువగా జరుగుతాయి. అయిదారు జట్లతో ఐపీఎల్ నిర్వహిస్తే భారత మహిళల క్రికెట్కు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచకప్లలో జట్టు ప్రదర్శనపై అది ప్రభావం చూపనుంది' అని మంధాన తెలిపారు.
కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రస్తుతం పురుషుల టోర్నీగా అదరగొడుతోంది. ఎందరో యువ ఆటగాళ్లు ఈ లీగ్ ద్వారా జాతీయ జట్టులోకి వచ్చారు. దీంతో మహిళల ఐపీఎల్ నిర్వహించాలని డిమాండ్లు పెరిగాయి. రెండేళ్ల క్రితం ఎగ్జిబిషన్ మ్యాచ్తో మహిళల ఐపీఎల్కు బీసీసీఐ అంకురార్పణ చేసింది. గతేడాది మూడు జట్లతో లీగ్ నిర్వహించింది. ఈ సారి జట్ల సంఖ్యను నాలుగుకు పెంచాలని నిర్ణయించినా.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లీగ్ నిరవధికంగా వాయిదా పడింది.
ఐపీఎల్లో మహిళల విభాగంలోనూ ఈ టోర్నీ జరగాలని టీమిండియా మహిళల వన్డే జట్టు సారథి మిథాలీ రాజ్ ఇదివరకే అభిప్రాయం వ్యక్తం చేసారు. పురుషులంత కాకపోయినా పరిమిత స్థాయిలోనైనా మహిళల ఐపీఎల్ ప్రారంభించాలని కోరారు. పురుషుల ఐపీఎల్తో పోలిస్తే కొన్ని నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వాలన్నారు. నలుగురు విదేశీ క్రికెటర్లే కాకుండా తొలి సీజన్లో ఐదు లేదా ఆరుగురితో ఆడించాలన్నారు. పూర్తిస్థాయి ఐపీఎల్ ఆడేందుకు భారత్లో ఎక్కువ మంది మహిళా క్రికెటర్లు లేకపోయినా.. ప్రస్తుత ఫ్రాంఛైజీలు జట్లను తీసుకుంటే ఆ సమస్యను అధిగమించొచ్చని టీమిండియా కెప్టెన్ అభిప్రాయపడ్డారు.