
ఇంగ్లాండ్ పర్యటనలో భారత వుమెన్స్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన బ్యాటింగ్లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. మంధాన టీ20లు, వన్డేలలో మంచి ప్రదర్శన కనబరిచింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్లో మంధాన కెరీర్లో అత్యుత్తమ ర్యాంకింగ్ అందుకుంది. టీ20ల్లో రెండో స్థానానికి చేరుకుంది. ఇంగ్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో మంధాన 111పరుగులు చేసింది. వన్డే సిరీస్లోనూ ఫామ్ను కొనసాగిస్తోంది. మంధాన మొదటి వన్డే మ్యాచ్లో 91పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. వన్డే ర్యాంకింగ్స్లో మంధాన మూడు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది.
ఇక భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా వన్డే ర్యాంకింగ్స్లో గణనీయంగా మెరుగైంది. ఆమె నాలుగు స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఆల్రౌండర్ దీప్తి శర్మ కూడా ఒక స్థానం ఎగబాకి 32వ స్థానానికి చేరుకుంది. బౌలర్ల ర్యాంకింగ్స్లో దీప్తి శర్మ ఆరు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకుంది.
ఇంగ్లాండ్తో జరిగిన తొలి వన్డేలో మంచి టచ్ కనబర్చిన వికెట్ కీపర్ యాస్తికా భాటియా కూడా ర్యాంకింగ్స్లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 37వ స్థానానికి చేరుకుంది. టీ20 బ్యాటర్లలో హర్మన్ప్రీత్ కూడా 14వ స్థానానికి చేరుకోగా.. రేణుకా సింగ్, స్పిన్నర్ రాధా యాదవ్ కూడా ర్యాంకింగ్స్లో ఎగబాకి వరుసగా 10, 14వ స్థానాలకు చేరుకున్నారు.
ఇకపోతే మంధాన మొదటి వన్డేలో త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాక పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో మాట్లాడింది. తానో తెలివితక్కువ షాట్ ఆడానంటూ చెప్పింది. అయితే జట్టు విజయానికి సహకరించిన ఇన్నింగ్స్ ఆడడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది. చాలా సార్లు 70 లేదా 80లలో ఉన్నప్పుడు..షాట్ కొట్టాలనుకుంటూ బంతి ఆపేదాన్నని.. కానీ తొలి వన్డేలో మాత్రం హిట్ చేయాలనుకున్న ప్రతిసారి హిట్ చేయగలిగానని మంధాన తెలిపింది.