బెంబేలెత్తించిన రబాడ:
మంగళవారం జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ కుశాల్ పెరీరా (33 బంతుల్లో 39; 3 ఫోర్లు) మాత్రమే రాణించాడు. అవిష్క ఫెర్నాండో (12), ధనంజయ్ ది సిల్వా (1), బానుక రాజపక్స (5), కమిందు మెండిస్ (10), దాసున్ శనక (18) పూర్తిగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరలో చమిక కరుణరత్నే (19 బంతుల్లో 24 నాటౌట్; 2 సిక్స్లు) బ్యాట్ జులిపించడంతో లంక ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. లేదంటే లంక 100 పరుగులు కూడా చేసేదే కాదు. జార్న్ ఫోర్టుయిన్ (2/21), కాగిసో రబాడ (2/23), కేశవ్ మహరాజ్ (1/14)ల ధాటికి లంక బ్యాట్స్మన్ క్రీజులో నిలవలేకపోయారు.
డికాక్ హాఫ్ సెంచరీ:
ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 14.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 121 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (46 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు), రీజా హెండ్రిక్స్ (42 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అజేయమైన తొలి వికెట్కు 121 పరుగులు జోడించారు. డికాక్, హెండ్రిక్స్ వరుస బౌండరీలతో చెలరేగారు. ఈ జోడీని విడదీయడానికి లంక బౌలర్లు ఆపసోపాలు పడ్డారు. కెప్టెన్ దాసున్ శనక పదేపదే బౌలర్లను మార్చినా.. ఫలితం లేకుండా పోయింది. లంక స్టార్ బౌలర్ వనిందు హసరంగ పూర్తిగా తేలిపోయాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 35 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేదు. సిరీస్ ఆసాంతం రాణించిన డికాక్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డును కూడా అందుకున్నాడు.
ఆనందంలో ఫాన్స్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచులు సెప్టెంబర్ 19న ఆరంభం కానున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్తో ఐపీఎల్ తిరిగి ఆరంభం కానుంది. ఐపీఎల్ 2021లో పాల్గొనే శ్రీలంక, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఈ రోజు యూఏఈ చేరుకోనున్నారు. లంకపై ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఫామ్ ఐపీఎల్ టోర్నీలో కూడా కోణగించాలని వారు కోరుకుంటున్నారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన పేసర్ కాగిసో రబాడ కూడా లంక సిరీసులో అదరగొట్టాడు.
సెప్టెంబర్ 19న చెన్నైతో ముంబై మ్యాచ్:
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, బ్యాట్స్మన్ సూర్యకుమార్ యాదవ్ సతీ సమేతంగా గత ఆదివారం అబుదాబిలో అడుగుపెట్టారు. ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుతో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్లు.. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్ల కోసం ముంబై ఇండియన్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో యూఏఈకి చేరుకున్నారు. ఇప్పటికే ముంబై ఇండియన్స్ అబుదాబి వేదికగా ప్రాక్టీస్ క్యాంప్ ఏర్పాటు చేయగా.. బీసీసీఐ ఆదేశాల మేరకు ఈ ముగ్గురు ఆటగాళ్లు వారం రోజులు పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత జట్టుతో కలవనున్నారు. సెప్టెంబర్ 19న చెన్నైతో ముంబై తలపడనుంది.