
గాలె: శ్రీలంకను తక్కువ అంచనా వేసిన న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. బుధవారం గాలె వేదికగా ఇరు జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు సిసలైన ఆరంభం లభించింది. బంతితో శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ అఖిల ధనంజయ (5/57) విజృంభణ చేయడంతో న్యూజిలాండ్ తొలుత తడబడినా.. సీనియర్ బ్యాట్స్మన్ రాస్ టేలర్ (86 బ్యాటింగ్; 131 బంతుల్లో 6×4) అర్ధ శతకంతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలబెట్టాడు.
కివీస్ ఓపెనర్లు జీత్ రావల్ (33), టామ్ లాథమ్ (30) మంచి ఆరంభమే ఇచ్చారు. ఈ జోడి కుదురుకుంటున్న దశలో ధనంజయ గట్టి దెబ్బ తీశాడు. 27వ ఓవర్లో లాథమ్ను ఔట్ చేసి 64 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అదే ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (0)ను కూడా పెవిలియన్ చేర్చాడు. అనంతరం రావల్ను కూడా ఔట్ చేయడంతో కివీస్ 71/3తో కష్టాల్లో పడి లంచ్కు వెళ్లింది. లంచ్ అనంతరం రాస్ టేలర్కు హెన్రీ నికోలస్ (78 బంతుల్లో 42, 2ఫోర్లు) మంచి సహకారమందించాడు. ఈ జోడి కుదురుకోవడంతో 100 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
మరోసారి విజృంభించిన ధనంజయ.. నికోలస్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లోనే వాట్లింగ్ (1)నూ కూడా ఔట్ చేసాడు. బుధవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 68 ఓవర్లలో 203/5తో నిలిచింది. టేలర్, సాంట్నర్ (8) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. వర్షం కారణంగా ఆటను 22 ఓవర్ల ముందుగానే నిలిపేశారు. తొలి రోజు వికెట్లన్నీ ధనంజయ ఖాతాలోనే చేరాయి. గురువారం రెండో రోజు ఆట నిర్ణీత సమయం కన్నా త్వరగా మొదలు కానుంది. టెస్టు ప్రపంచ చాంపియన్షిప్లో శ్రీలంక, న్యూజిలాండ్కు ఇదే తొలి మ్యాచ్.