మైసూరు: ఇండియా-ఎ యువ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్(137 బంతుల్లో 92; 12 ఫోర్లు, సిక్స్), కరుణ్ నాయర్ (78 బ్యాటింగ్; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. గిల్ వరుసగా రెండో మ్యాచ్లోనూ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దక్షిణాఫ్రికా-ఏతో జరుగుతున్న రెండో అనధికారిక (నాలుగు రోజులు) టెస్టులో గిల్ సూపర్ ఇన్నింగ్స్తో ఆకట్టుకోవడంతో మంగళవారం ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 74 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ఎంపికైన శుభ్మన్ గిల్ తొలి మ్యాచ్లో 90 పరుగులు చేశాడు.
బెట్టింగ్ను న్యాయబద్ధం చేస్తే భారత క్రికెట్లో అవినీతిని అరికట్టొచ్చు
ఫామ్లో ఉన్న ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (5), ప్రియాంక్ పాంచల్ (6) త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన శుబ్మన్, నాయర్ మూడో వికెట్కు 135 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఈ జోడి దక్షిణాఫ్రికా టెస్టు జట్టు సభ్యులైన పేసర్లు ఫిలాండర్, ఇన్గిడి, స్పిన్నర్ ముతుస్వామిలను దీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశారు. అయితే సెంచరీకి 8 పరుగుల దూరంలో సిపామ్లా బౌలింగ్లో గిల్ పెవిలియన్ చేరాడు.
ఈ దశలో కరుణ్కు కెప్టెన్ వృద్ధిమాన్ సాహా (86 బంతుల్లో 36; 5 ఫోర్లు) సహకారం అందించాడు. ఈ ఇద్దరు అబేధ్యమైన నాలుగో వికెట్కు 67 పరుగులు జోడించారు. అయితే వెలుతురు సరిగా లేని కారణంగా మంగళవారం 74 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆట చివరకు క్రీజులో నాయర్ (78), వృద్ధిమాన్ సాహా (36) ఉన్నారు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో తాత్కాలిక కెప్టెన్గా ఉన్న గిల్ (90) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇతనికి తోడు బౌలర్లు రాణించడంతో ప్రొటీస్ను భారత్-ఏ సునాయాసంగా ఓడించింది.