
లాహోర్: పాకిస్థాన్ మాజీ కెప్టెన్, భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్కు పెను ప్రమాదం తప్పింది. మాలిక్ ప్రయాణిస్తున్న కారు లాహోర్లో ఓ ట్రక్కును ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో మాలిక్ సురక్షితంగా బయటపడ్డాడు. మాలిక్ కారును స్పీడ్గా నడిపడం వల్లే కారు ట్రక్ను ఢీ కొట్టినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. కారు ఒక్కసారిగా రోడ్డుపై స్కిడ్ అయిందని, ఆపై అక్కడే పార్కింగ్ చేసి ఉన్న ట్రక్ను బలంగా ఢీకొట్టిందని తెలిపారు.
వివరాల్లోకి వెళితే... లాహోర్లోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రధాన కార్యాలయం నేషనల్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో నిర్వహించిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)-2021కు సంబంధించిన డ్రాఫ్ట్ సమావేశానికి షోయబ్ మాలిక్ హాజరయ్యాడు. రాత్రి స్పోర్ట్స్ కారులో అతడు ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గమధ్యలో ఈ కారు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి.. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచిన ఓ ట్రక్ని వేగంగా ఢీ కొట్టింది. వెంటనే బెలూన్లు తెరచుకోవడంతో మాలిక్ సురక్షితంగా బయటపడ్డాడు. గాయాలు కూడా తగల్లేదు.
పాకిస్తాన్ స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. సహచర ఆటగాడు వాహబ్ రియాజ్తో సరదా రేస్లో పోటీపడిన షోయబ్ మాలిక్.. అతడి కారుని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కారుని అదుపు చేయలేక ఈ యాక్సిడెంట్ చేశాడట. రెస్టారెంట్ వద్ద ట్రక్ పార్క్ చేసి ఉండగా.. మాలిక్ కారు వెళ్లి దాన్ని ఢీకొట్టింది. దాంతో అక్కడే భోజనం చేస్తున్న వారు అక్కడికి చేరుకొని మాలిక్ని కారు నుంచి వెలుపలికి తీశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే కారులో మాలిక్ వెళ్లిపోయినట్లు సమాచారం. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయిపోగా.. లగ్జరీ స్పోర్ట్స్ కారు కావడంతో మాలిక్కి ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ సమాచారం తెలిసిన వెంటనే పాకిస్తాన్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పలువురు క్రికెటర్లు, మాజీ ప్లేయర్లు షోయబ్ మాలిక్కు ఫోన్ చేసి ప్రమాదం గురించి ఆరా తీశారు. ఈ ఘటనపై షోయబ్ మాలిక్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. తాను క్షేమంగా ఉన్నానని పేర్కొన్నాడు. ఎలాంటి గాయాలు కూడా తగల్లేదని స్పష్టం చేశాడు. వన్డే, టెస్టులకి ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన మాలిక్.. టీ20ల్లో మాత్రం కొనసాగుతున్నాడు. పాకిస్తాన్ జాతీయ జట్టు తరఫున 35 టెస్ట్ మ్యాచ్లు, 287 వన్డేలు, 116 టీ20 మ్యాచ్లు ఆడాడు. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని మాలిక్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.