అల్లా టప్పా టీమ్ కాకుండా సాలిడ్ టీమ్ను ఎంపిక చేయండి.. మళ్లీ ఓడితే బాగుండదు భారత్కు అక్తర్ వార్నింగ్!

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్కు అల్లా టప్పా టీమ్ కాకుండా బలమైన జట్టును ఎంపిక చేయాలని భారత సెలెక్టర్లకు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సూచించాడు. కనీసం ఈ సారైనా పాకిస్థాన్కు భారత్కు గట్టి పోటీనివ్వాలని అభిప్రాయపడ్డాడు. గతేడాదే భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగిందన్నాడు. ఇక ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లో భారత్.. మళ్లీ పాకిస్థాన్తోనే తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ గురించి మాట్లాడిన అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత పరిస్థితుల్లో విజేత ఎవరో చెప్పడం కష్టమన్నాడు

సాలిడ్ టీమ్ను ఎంపిక చేయాలి..
'పాకిస్థాన్తో మ్యాచ్కు అలాంటి ఇలాంటి టీమ్ను ఎంపిక చేస్తే సరిపోదు. టీమిండియా మేనేజ్మెంట్, సెలక్టర్లు కలిసి చాలా జాగ్రత్తగా టీమ్ని ఎంపిక చేయాలి. వాళ్లు సాలిడ్ టీమ్నే ఎంపిక చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి కూడా మాకు ఈజీ వాకోవర్ కాకూడదు. బలమైన జట్టును ఎంపిక చేస్తేనే పాకిస్థాన్ను భారత్ ఓడించగలదు. ఇప్పుడు రెండు జట్లూ చాలా భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఎవరు గెలుస్తారని ముందే చెప్పడం కష్టం.

70 వేల మంది..
మెల్బోర్న్ పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుంది. కాబట్టి తొలుత బ్యాటింగ్ చేసి, ఛేదనలో టీమిండియాను ఆలౌట్ చేయడం పాకిస్తాన్కి తేలికవుతుంది. స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు ఉంటే, వారిలో 70 వేల మంది టీమిండియాకే సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఒత్తిడి పాకిస్థాన్పైనే ఎక్కువగా ఉంటుంది. అయితే అంత మంది ప్రేక్షకుల మధ్య ఓడిపోతామేమో అనే భయం కూడా భారత జట్టును వెంటాడుతోంది'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

గతేడాది ఖంగుతిన్న భారత్..
ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్పై భారత్దే పూర్తి ఆధిపత్యం. అయితే గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. భారత్ను పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా భారత్పై టీ20 ప్రపంచకప్ల్లో పాకిస్థాన్ తొలి విజయాన్నందుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్లు త్వరగా ఔటవ్వడం భారత విజయవకాశాలను దెబ్బతీసింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పోరాడినా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగులు మాత్రమే చేయగలిగింది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ కలిసి తొలి వికెట్కి 153 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి పాకిస్థాన్కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. వన్డే వరల్డ్ కప్లో భారత జట్టు చేతుల్లో పాకిస్థాన్ 7 సార్లు, ఐదు సార్లు టీ20 వరల్డ్ కప్లో చిత్తుగా ఓడిపోయింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications