|
మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ధావన్
ధావన్ జట్టుతో పాటు మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉంటాడని బీసీసీఐ తెలిపింది. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ ధావన్ గాయాన్ని పరిశీలిస్తున్నారని.. న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్కి మాత్రం అతడు దూరం కానున్నట్లు బీసీసీఐ తన ట్విట్టర్లో పేర్కొంది. అతడి స్థానంలో వేరొక ఆటగాడిని బీసీసీఐ ఎంపిక చేయలేదు.
ఐసీసీ నిబంధన ప్రకారం
ఐసీసీ నిబంధన ప్రకారం గాయపడ్డ ఆటగాడి స్థానంలో మరొకరిని తీసుకుంటే.. ఆ ఆటగాడు మళ్లీ కోలుకున్నప్పటికీ అతడిని జట్టులోకి తిరిగి రావడానికి వీల్లేదు. గాయపడ్డ ఆటగాడి స్థానంలో ఎంపికైన ఆటగాడిని తప్పించి, పాత ఆటగాడిని ఎంచుకోవడానికి ఐసీసీ నిబంధనలు ఒప్పుకోవు.
ఎన్ని రోజులు ఆటకు దూరం
నిజానికి ధావన్ ఎన్ని రోజులు ఆటకు దూరమవుతాడన్న విషయంలో బీసీసీఐకి కూడా స్పష్టత లేదు. కనీసం మూడు మ్యాచ్లకు ధావన్ దూరమవుతాడని వైద్యులు అంచనా వేస్తున్నారు. టోర్నీలో భాగంగా గురువారం న్యూజిలాండ్తో, ఆదివారం పాకిస్థాన్తో, జూన్ 22న అఫ్గానిస్థాన్తో తలపడనుంది.
ధావన్కు మూడు వారాల విశ్రాంతి
ధావన్కు మూడు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు కాబట్టి ఈ మూడు మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత జూన్ 27న వెస్టిండీస్తో, 30న ఇంగ్లాండ్తో కోహ్లీసేన తలపడనుంది. ఇవి ఎంతో కీలక మ్యాచ్లు కావడంతో ఆ సయమానికి ధావన్ కోలుకుంటే అతడిని తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ఆలోచన.
ధావన్ గనుక కోలుకోని పక్షంలో
ఈ మూడు వారాల్లో ధావన్ గనుక కోలుకోని పక్షంలో రిషబ్ పంత్ను అతడి స్థానంలో ఎంపిక చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ను ముందు జాగ్రత్తగా ఇంగ్లాండ్కు పిలిపించే అవకాశం ఉంది. ధావన్ కోలుకునే అవకాశం లేదని తెలిసినా లేదా టోర్నీలో మరో ఆటగాడు గాయపడితే వెంటనే పంత్ను తుది జట్టులోకి తీసుకుంటారు.
ఓపెనర్గా కేఎల్ రాహుల్
గాయం కారణంగా ధావన్ దూరం కావడంతో ఆతడి స్థానాన్ని కేఎల్ రాహుల్తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఇక, గురువారం న్యూజిలాండ్తో జరిగే మ్యాచ్లో నాలుగో స్థానంపై కూడా స్పష్టత రానుంది. నాలుగో స్థానంలో ఆల్రౌండర్ విజయ్ శంకర్, వికెట్ కీపర్ బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ రేసులో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి మరి.