స్టేట్ లెవల్ టోర్నమెంట్లో క్రీడాకారులకు ఓ టాయిలెట్లో భోజనం పెట్టడంపై భారత స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్ సీరియస్ అయ్యాడు. ఈ విషయమై వెంటనే చర్యలు చేపట్టాలని శిఖర్ ధావన్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ విషయాన్ని తెలియజెప్పాడు. ఇటీవల యువ కబడ్డీ ఆటగాళ్ల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడం చాలా దిగ్బ్రాంతిగా అనిపించిందని పేర్కొన్నాడు. బుధవారం ట్విట్టర్లో తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
'రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో కబడ్డీ ఆటగాళ్లు టాయిలెట్లో ఆహారం తీసుకోవడం చాలా విచారకరంగా అనిపించింది. దీన్ని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం యోగి ఆదిత్యానాథ్ను అలాగే యూపీ స్పోర్ట్స్ మినిస్టర్ను అభ్యర్థించాడు' అని ధావన్ ట్వీట్ చేశాడు. ఈ వారం ప్రారంభంలో వైరల్ అయిన ఈ ఘటన వీడియోను స్టార్ బ్యాటర్ తన ట్విట్టరులో కూడా పోస్ట్ చేశాడు.
This is very disheartening to see Kabaddi players at State level tournament having food in toilet. Would request @myogiadityanath & @UPGovtSports to look into the same and take necessary action. pic.twitter.com/2pekZW8Icx
— Shikhar Dhawan (@SDhawan25) September 21, 2022
ఇటీవల ఈ పరిణామాల రీత్యా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఘటన జరిగిన సహరాన్పూర్ ప్రాంతీయ క్రీడా అధికారిని ఈ విషయమై సస్పెండ్ చేసింది. సహరాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ విచారణకు కూడా ఆదేశించారు. ఈ విషయమై చర్యలు చేపట్టాలని యూపీ క్రీడా శాఖను కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ సైతం ఆదేశించారు.
ఈ కబడ్డీ టోర్నమెంట్కు అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఏకేఎఫ్ఐ) లేదా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని యూపీ స్టేట్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపాడు. ఈ ఈవెంట్ వార్షిక క్యాలెండర్లో భాగం కాదని కూడా ఆయన చెప్పాడు. ఈ టోర్నీని రాష్ట్ర ప్రభుత్వ క్రీడా విభాగం నిర్వహించింది. కేవలం సాంకేతిక సహకారం అందించడమే మా పాత్ర. ఈ ఈవెంట్ని నిర్వహించడానికి మేము కొంతమంది అధికారులను, సెలక్షన్ కమిటీని పంపాం కానీ ఇందులో మాకు సంబంధం లేదని' అని సింగ్ చెప్పారు.