
మూడో వన్డేలో గాయం:
గత ఏడాది గాయాలతో సతమతమైన శిఖర్ ధావన్.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఆడిన షాట్ను అడ్డుకునే యత్నంలో ధావన్ ఎడమ భుజానికి గాయమైంది. డైవ్ చేసిన తర్వాత అతడు తన ఎడమ భుజాన్ని కదలించడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడు మైదానాన్ని వీడాడు.

గాయంతో ధావన్ ఔట్:
గాయం తర్వాత ధావన్ చేతికి కట్టుతో కనిపించాడు. చహల్ ధావన్ బదులుగా ఫీల్డింగ్ చేసాడు. ఆపై బ్యాటింగ్ చేసేందుకు కూడా గబ్బర్ బరిలోకి దిగలేదు. దీంతో రోహిత్ శర్మకు జతగా కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించాడు. మూడు వికెట్లు పడినా కూడా ధావన్ బ్యాటింగ్కు రాలేదు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు భారత జట్టు మేనేజ్మెంట్ ధావన్కు ఎక్స్రే తీయించింది. కోలుకునేందుకు సమయం పట్టనుండంతో.. న్యూజిలాండ్తో జరిగే టీ20, వన్డే సిరీస్కి అధికారికంగా దూరమయ్యాడు.

అగర్వాల్కి ఛాన్స్:
సోమవారం ఆక్లాండ్ బయలుదేరిన భారత జట్టుతో ధావన్ ప్రయాణించలేదు. ఇక గాయపడిన ధావన్ స్థానంలో బీసీసీఐ సెలెక్టర్లు ఇంకా ఎవరిని ఎంపిక చేయలేదు. ఇండియా-ఎ జట్టు ఇప్పటికే న్యూజిలాండ్లో ఉన్నందున ఆ జట్టు నుండి ఎవరైనా సెలెక్టర్లు తీసుకోవచ్చని సమాచారం తెలుస్తోంది. రేసులో పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక శుభమన్ గిల్ పేరు కూడా వరుసలో ఉంది. మయాంక్ అగర్వాల్కి ఛాన్స్ దక్కే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

ఇది నాలుగో గాయం:
చేతి వేలి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ నుంచి భారత్కి వచ్చేసిన ధావన్.. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో గాయపడ్డాడు. కోలుకున్న తర్వాత తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్లోనూ రాజ్కోట్ వన్డేలో గాయపడ్డాడు. ప్రపంచకప్ నుంచి అతడు గాయపడడం ఇది నాలుగోసారి. న్యూజిలాండ్ గడ్డపై ఈ నెల 24 నుంచి టీమిండియా ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది.


Click it and Unblock the Notifications
