భారత జట్టులో గట్టిపోటీ: యువ క్రికెటర్లు షా, పంత్లపై ధావన్ ప్రశంస


హైదరాబాద్: పృథ్వీ షా, రిషబ్ పంత్ లాంటి యువ క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్లోకి రాకముందే పరిణితి సాధిస్తున్నారని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వ్యాఖ్యానించాడు. భారత జట్టుకు అండర్-19 వరల్డ్కప్ అందించిన పృథ్వీ షా ఇప్పటికే టెస్టుల్లోకి అరంగేట్రం చేయగా, తాజాగా శుభ్మన్ గిల్ న్యూజిలాండ్ సిరీస్లో అరంగేట్రానికి సిద్ధమయ్యాడు.
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మౌంట్ మాంగనూయ్ వేదికగా రెండో వన్డే శనివారం జరగనుంది. ఈ నేపథ్యంలో రెండో వన్డేకు ముందు శిఖర్ ధావన్ మాట్లాడుతూ "యువ ఆటగాళ్లు త్వరగా పరిణతి సాధిస్తున్నారు. జట్టులో పోటీ పెంచుతున్నారు. ప్రతి ఒక్కరూ చోటు కోసం పోరాడాల్సి వస్తోంది" అని అన్నాడు.

భారత జట్టులో విపరీతమైన పోటీ
"పృథ్వీ షా విండీస్ టెస్టులో సెంచరీ, 70తో రాణించాడు. ఇది మన రిజర్వు బెంచ్ బలమేంటో చూపిస్తోంది. తుది జట్టు సంగతేమో గానీ ఎంపికయ్యే 15 మందికీ విపరీతమైన పోటీ ఉంది. ఇక నేను 5000 పరుగుల మైలురాయి దాటేశానంటే నేను బాగా ఆడుతున్నట్టే. అందుకు సంతోషంగా ఉంది" అని శిఖర్ ధావన్ తెలిపాడు.

గత అనుభవం కలిసొచ్చింది
"ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పరిస్థితులు దాదాపుగా ఒకేలా ఉంటాయి. గతంలో న్యూజిలాండ్లో ఆడా. దీంతో ఆ అనుభవం ప్రస్తుతం ఇక్కడ ఆడేందుకు ఉపయోగపడుతుంది. నా బ్యాటింగ్ టెక్నిక్ అన్ని వికెట్లపై ఆడేందుకు బాగుంటుంది. ఫుట్వర్క్లో మార్పులేమీ చేయలేదు" అని ధావన్ పేర్కొన్నాడు.

కోహ్లీతో ఇలా
నేపియర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కెప్టెన్ కోహ్లీతో కలిసి ధావన్ తొలి వికెట్కు 91 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీనిపై ధావన్ మాట్లాడుతూ "కోహ్లీతో ఆడుతున్నప్పుడు మేమిద్దరం స్ట్రైక్ రొటేట్ చేసుకుంటాం. ఒత్తిడిని పంచుకుంటాం. ఒకరు బౌండరీ బాదితే మరొకరిలో ఉత్సాహాన్ని నింపుతుంది" అని ధావన్ అన్నాడు.

సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు
తొలి 10 ఓవర్లలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేసి జట్టుని భారీ స్కోరు దిశగా తీసుకేళ్లడమే తన లక్ష్యమని ధావన్ చెప్పుకొచ్చాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా రెండో వన్డే శనివారం మౌంట్ మాంగనూయ్లోని బే ఓవల్ స్టేడియంలో ఉదయం 7.30 గంటలకు ప్రారంభం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications