ధావన్ కూడా ముఖ్య ఆటగాడే
తాజాగా హర్భజన్ మాట్లాడుతూ... 'శిఖర్ ధావన్ మరియు రోహిత్ శర్మ టీమిండియా అత్యుత్తమ బ్యాట్స్మన్లు. టీమిండియా ఉత్తమ ఓపెనింగ్ జోడిలలో ఒకరని ఇప్పటికే నిరూపించారు. ధావన్ టీమిండియాకు మంచి విజయాలు అందించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాగా ధావన్ కూడా టీమిండియాకు ముఖ్య ఆటగాడే' అని అన్నారు.
రోహిత్ శర్మకు సరైన జోడి
'టీ20, వన్డే అనే సంబంధం లేకుండా ధావన్ మంచి ప్రదర్శన చేసాడు. భారత బ్యాటింగ్ యూనిట్ ప్రధాన స్తంభాలలో ఒకడిగా కొనసాగుతున్నాడు. నా అభిప్రాయం ప్రకారం టీ20, వన్డేలలో రోహిత్ శర్మకు సరైన జోడి ధావన్ మాత్రమే. వచ్చే రెండు మూడు సంవత్సరాలు ఫిట్నెస్ను కాపాడుకుంటే అతన్ని ఎవరూ ఆపలేరు. ధావన్ కచ్చితంగా రాణిస్తాడు' అని హర్భజన్ ధీమా వ్యక్తం చేశారు.
ఎంతకాలం అవకాశమిస్తారు
ఇటీవల లక్ష్మణ్ మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతోంది. టీమిండియాకు ఇంకా 20 మ్యాచులు ఉన్నాయి. కాబట్టి రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేది ఎవరనే విషయంలో జట్టు యాజమాన్యం ఓ స్పష్టతకు రావాలి. శిఖర్ ధావన్ను ఎలా చూస్తున్నారో చెప్పాలి. ధావన్ని ప్రపంచకప్లో ఆడించాలని టీమిండియా భావిస్తోందా?. లేదంటే ఇప్పుడే అతని టీ20 భవితవ్యంపై ఓ నిర్ణయం తీసుకుంటే మంచింది. ఎందుకంటే ఓపెనింగ్ చేయడానికి చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. గత కొంతకాలంగా పేలవ ఫామ్తో నిరాశపరుస్తున్నాడు. ఎంతకాలం ధావన్కు అవకాశమిస్తారనేది చూడాలి' అని లక్ష్మణ్ అన్నాడు.
పేలవ ఫామ్
ఈ ఏడాది 7 టీ20 మ్యాచ్లాడిన శిఖర్ ధావన్ 105 పరుగులు చేసాడు. అతని సగటు 15గా ఉంది. ఇక విండీస్ టూర్లో జరిగిన మూడు టీ20ల్లో 27 పరుగులు మాత్రమే చేసి పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రపంచకప్లో ఆస్ట్రేలియాపై చేసిన సెంచరీనే ఇటీవలి కాలంలో ధావన్ చెప్పుకోదగ్గ మంచి ప్రదర్శన. గాయం కారణంగా ప్రపంచకప్ నుండి అర్ధాంతరంగా వైదొలిగిన అనంతరం విండీస్ టూర్లో దారుణంగా విఫలమయి విమర్శల పాలయ్యాడు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి అతనిపై నమ్మకంగా ఉన్నారు. మరి దక్షిణాఫ్రికా టూర్లోనైనా రాణిస్తాడో చూడాలి.