జట్టులోకి యువ ఓపెనర్ పృథ్వీషా:
తొలి రెండు టెస్టుల్లో ఘోరంగా విఫలమైన మురళీ విజయ్పై వేటు వేసిన సెలక్టర్లు.. అతని స్థానంలో యువ ఓపెనర్ పృథ్వీషాని జట్టులోకి తీసుకున్నారు. అంతేకాకుండా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని కూడా జట్టు నుంచి తప్పించి హనుమ విహారీకి అవకాశం కల్పించారు. ఇంగ్లాండ్తో ఈనెల 30 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుండగా.. సెప్టెంబరు 7 నుంచి చివరి టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.
అండర్-19 ప్రపంచకప్, ఐపీఎల్లలో అద్భుత ప్రదర్శన:
అండర్-19 ప్రపంచకప్, ఐపీఎల్ 2018 సీజన్లో అత్యుత్తమంగా రాణించిన పృథ్వీషా.. తన ఆటతీరుతో సెలక్టర్లని ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టుల్లోనూ కేఎల్ రాహుల్.. అవకాశం దొరికిన రెండు టెస్టుల్లో ధావన్ విఫలమైన నేపథ్యంలో.. నాలుగో టెస్టుల్లో పృధ్వీషాకి ఛాన్సిచ్చినా ఆశ్చర్యపోలేం. ఇప్పటికే మూడో టెస్టులో దినేశ్ కార్తీక్ను పక్కన పెట్టి.. రిషబ్కి అవకాశమిచ్చిన కోహ్లి.. ఆటగాళ్ల కెరీర్ కంటే.. జట్టు గెలుపే తనకి ముఖ్యమని కరాఖండిగా చెప్పేశాడు. దీంతో.. నాలుగో టెస్టులో కూడా తుది జట్టులో మార్పులు ఉండబోతున్నాయని తాజాగా జట్టు ఎంపికని చూస్తే అర్థమవుతోంది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక సగటు హనుమ విహారిదే:
భారత టెస్టు జట్టుకి ఎంపికైన మూడో ఆంధ్ర ప్లేయర్గా హనుమ విహారి రికార్డ్ క్రియేట్ చేశాడు. సీకే నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత భారత టెస్టు జట్టుకు ఎంపికైంది హనుమ విహారి మాత్రమే. చక్కటి డిఫెన్స్, మంచి టెక్నిక్ అతడి బలం. విజయ్ ఈ సిరీస్లో దారుణంగా విఫలం కావడంతో.. 18 ఏళ్ల పృథ్వీ షాకి టెస్టుల్లోకి స్థానం దక్కింది. ప్రస్తుతం ఆడుతున్న ఫస్ట్ క్లాస్ క్రికెటర్లలో అత్యధిక సగటు హనుమ విహారిదే కావడం గమనార్హం.
నాలుగైదు టెస్టులకు టీమిండియా ఇదే:
ఇంగ్లాండ్తో నాలుగు, ఐదు టెస్టుల కోసం ఎంపిక చేసిన భారత జట్టు ఇదే.. విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పృధ్వీషా, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్, కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), హనుమ విహారి.