
హైదరాబాద్: ఆదివారం కొలంబో వేదికగా నిదహాస్ ట్రోపీ ముగిసింది. ముక్కోణపు సిరీస్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య హోరాహోరీ పోరులో భారత జట్టు తీవ్ర ఉత్కంఠ మధ్య విజేతగా నిలిచింది. దానికంటే ముందు బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు పోటీపడ్డాయి. ఈ పోరులో బంగ్లా జట్టు ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్లో కాస్త అలజడి సృష్టించారు.
అంతకుముందు టీ20 సిరీస్ చివరి లీగ్ మ్యాచ్ ఆట చివర్లో వివాదం చోటు చేసుకుంది. లంక బౌలర్ ఉదాన వరుసగా రెండో బంతిని కూడా ఎక్కువ ఎత్తుకు విసిరినప్పటికీ నోబాల్ ఇవ్వకపోవడంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు గొడవ చేయడం, కెప్టెన్ షకిబ్ అల్హసన్ క్రీజులో ఉన్న బ్యాట్స్మెన్ను వెనక్కి వచ్చేయాలని కోరడం పెద్ద చర్చకే దారి తీసింది.
ఈ గొడవ అనంతరం, మ్యాచ్ ముగిశాక బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూం గది అద్దం పగలడం సంచలనం రేపింది. అయితే దీనికి బాధ్యులెవరనే విషయంలో స్పష్టత లేకపోయింది. సీసీటీవీ కెమెరాల్లోనూ అద్దం పగిలిన ఘటన రికార్డవలేదు. అయితే మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ దీనిపై విచారణ జరిపాడు.
దాంతో.. అద్దం పగలగొట్టింది బంగ్లా కెప్టెన్ షకిబేనని తేలినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. ఆటగాళ్లకు ఆహార పదార్థాలు సరఫరా చేసిన సిబ్బంది ఈ విషయం వెల్లడించినట్లు సమాచారం. అయితే వీడియో సాక్ష్యాలు లేకపోవడంతో షకిబ్పై చర్యలు చేపట్టలేకపోయినట్లు తెలిసింది.