మతం కన్నా మానవత్వమే గొప్పా
ముస్లిం రాజ్యం అయిన పాకిస్థాన్లో మాములు సమయంలోనే ఇతర మతాల ప్రజలకు దక్కే గౌరవం చాలా తక్కువ. వారిని ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోదు. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితిలో వారి బతుకు అగమ్యగోచరం. కానీ అఫ్రిదీ అందరూ సమానమే.. మతం కన్నా మానవత్వమే గొప్పా అని చాటాడు. తన స్వచ్చంద సంస్థ ద్వారా క్రిస్టియన్లు, హిందువులకు బియ్యం అందజేశాడు. గత తొమ్మిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తు అందరి మన్ననలు అందుకుంటున్న అఫ్రిది ఈ రోజు మరో మెట్టు ఎక్కాడు. ఈ విషయాన్ని అతనే ట్వీటర్ వేదికగా తెలియజేశాడు.
అందరికీ భరోసా..
‘కొవిడ్-19 కట్టడిలో భాగంగా పదవరోజు కూడా షాహిద్ అఫ్రిదీ ఫౌండేషన్ ఉచిత రేషన్ సరఫరా కొనసాగుతుంది. కరాచీలోని హిందూ, క్రైస్తవులకు కూడా రేషన్ ఇవ్వడం జరిగింది. అందరికీ భరోసా ఇవ్వడం జరగుతుంది. ప్రతీ ఒక్కరిని కోరేదంటంటే.. దయచేసి ఇళ్లలోనే ఉంటూ మీ ప్రాణాలతో పాటు ఇతరులను రక్షించండి. అభాగ్యులకు అండగా ఉండేందుకు విరాళలు ఇవ్వండి'అని ట్వీట్ చేశాడు.
|
మెచ్చుకున్న యూవీ, భజ్జీ..
పాకిస్థాన్లో కరోనా వైరస్ కట్టడి కోసం అఫ్రిది ఫౌండేషన్ కృషి చేస్తుండటంతో ఇటీవల అతడిపై ప్రశంసలు కురిపించిన భారత వెటరన్ క్రికెటర్లు హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్.. అన్నింటికంటే మానవత్వం గొప్పదంటా కితాబిచ్చారు. అఫ్రిదికి మద్దతు తెలుపుతూ అతని ఫౌండేషన్కు విరాళాలు ఇవ్వాలని ఓ వీడియోను ట్వీట్ చేశాడు.
'ప్రతీ ఒక్కరికి ఇది చాలా కఠినమైన సమయం. ముఖ్యంగా అభాగ్యుల కష్టాలు చెప్పలేనివి. వారికి వీలైనంత సాయం చేద్దాం. షాహిద్ అఫ్రిదీ, అఫ్రిదీ ఫౌండేషన్కు నా మద్దతు ఉంటుంది. కోవిడ్-19 కట్టడికి అతను ఫౌండేషన్ చేస్తున్న కృషి అభినందనీయం. దయచేసి ఆ సంస్ధకు విరాళాలు ఇవ్వండి'అని యూవీ విజ్ఞప్తి చేశాడు.
ఫ్యాన్స్ ప్రశంసలు..
ఇక యూవీ, భజ్జీ ట్వీట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత అభిమానులు.. తాజాగా అఫ్రిది చేస్తున్న కృషికి సలాం చెబుతున్నారు. మతం కన్నా మానవత్వం గొప్పదని అఫ్రిదీ నిరూపించాడని ప్రశంసిస్తున్నారు. భేష్ అఫ్రిది అంటూ కొనియాడుతున్నారు. తమ వంతు సాయాన్ని కూడా అఫ్రిది ఫౌండేషన్కు అందజేస్తున్నారు.