
హైదరాబాద్: ఫిట్గా ఉన్నంత కాలం క్రికెట్ ఆడతానని, ఇప్పట్లో దేశవాళీ లీగ్ల నుంచి రిటైరయ్యే ప్రసక్తే లేదని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిది అఫ్రిది పేర్కొన్నాడు. గురువారం అఫ్రిది 38వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అరె స్పోర్ట్స్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
'ప్రస్తుతం రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి సుమారు ఏడాదిన్నర కావస్తోంది. ఇప్పుడు కేవలం దేశవాళీ టీ20 లీగ్స్లో మాత్రమే ఆడుతున్నా. ఫిట్గా ఉన్నంత కాలం ఈ లీగ్స్లోనే ఆడతా. రాబోయే రోజుల్లో క్రికెట్లో కొత్త ఫార్మాట్ను పరిచయం చేయనున్నారు. అదే టీ10' అని చెప్పాడు.
'క్రికెట్ నన్ను విడిచిపెట్టడం లేదు. ఆడగలిగే సత్తా ఉన్నంత వరకు క్రికెట్ను ఎంజాయ్ చేస్తా. గతంలో కూడా ఇదే విషయాన్ని అనేకసార్లు చెప్పా. నా అభిమానుల కోసం, నా ఫౌండేషన్ కోసం ఇంకా కొన్నాళ్లు క్రికెట్ ఆడతాను' అని అఫ్రిది వెల్లడించాడు. పీఎస్ఎల్ 3వ సీజన్లో భాగంగా ఫిబ్రవరి 23న క్వెట్టా గ్లాడియేటర్స్తో జరిగిన మ్యాచ్లో అఫ్రిది బౌండర్ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టిన సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ క్రికెట్కు ఏడాదిన్నర క్రితం రిటైర్మెంట్ ప్రకటించిన అఫ్రిది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోన్న దేశవాళీ టీ20 లీగ్స్లో ఆడుతున్నాడు. తన 21 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు 2017లో వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది ఫౌండేషన్ నెలకొల్పి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
పాకిస్థాన్లోని వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు చదువుతో పాటు హెల్త్ కేర్ సదుపాయాలను ఈ ఫౌండేషన్ కల్పిస్తోంది. తన అభిమానులు, ఈ ఫౌండేషన్ కోసమే తానింకా క్రికెట్ ఆడుతున్నానని అఫ్రిది పేర్కొన్నాడు. ప్రస్తుతం అఫ్రిది దేశవాళీ టీ20 లీగ్ల్లో ఓ సూపర్ స్టార్గా వెలుగొందుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత అఫ్రిది వెస్టిండిస్ (కరేబియన్ ప్రీమియర్ లీగ్), ఇంగ్లాండ్ (నాట్ వెస్ట్ టీ20 బ్లాస్ట్), బంగ్లాదేశ్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) తరుపున ఆడాడు. ప్రస్తుతం షార్జా వేదికగా జరుగుతోన్న పీఎస్ఎల్ మూడో సీజన్లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.