
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడిలో సుమారు నలభైకు పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అమర జవాన్లలో కొందరి పిల్లలకు సెహ్వాగ్ తన అంతర్జాతీయ స్కూల్లో ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు.
ఈ క్రమంలో ఓ పిల్లాడు క్రికెట్ శిక్షణ పొందుతున్న ఫోటోలను సెహ్వాగ్ తన ట్విట్టర్లో పోస్టు చేస్తూ "హీరోల కుమారులు. నా స్కూల్లో ఈ చిన్నారులకు సేవలు అందించడం ఎంతో గొప్ప విషయంగా భావిస్తున్నా. బ్యాట్స్మన్ - అర్పిత్ సింగ్ s/o అమర జవాన్ రామ్ వకీల్ కుమారుడు కాగా, బౌలర్ - రాహుల్ సోరెంగ్ s/o అమర జవాన్ విజయ్ సోరెంగ్ కుమారుడు). కొన్ని విషయాలు ఆనందాన్ని ఇస్తాయి" అని ట్వీట్ చేశాడు.
సెహ్వాగ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వీరులకు ఎంతో కొంత తిరిగి ఇవ్వడం మన విధి మీరు గొప్ప వారు సర్" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా... మరొక నెటిజన్ "సర్, మీరు గొప్ప వ్యక్తి, మంచి పని చేస్తున్నారు, అందుకే మీకు సెల్యూట్ చేస్తున్నా" అని ట్వీట్ చేశాడు.