
హైదరాబాద్: రాష్ట్రపతి భవన్లో శనివారం పద్మ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పద్మా అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. గంభీర్తో పాటు భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి, ఆర్చరీ క్రీడాకారిణి బంబేలా దేవి, బాస్కెట్బాల్ ప్లేయర్ ప్రశాంతి సింగ్ కూడా పద్మశ్రీ అందుకున్నారు.
ఒడిశాకు చెందిన ఛాయ్వాలా డీ ప్రకాశ్ రావు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఆయనతో పాటు పద్మశ్రీ అందుకున్నవారిలో హీరో మనోజ్ బాజ్పాయి, తబలా ఆర్టిస్ట్ సప్నా చౌదరీ, పబ్లిక్ అఫైర్స్లో హెచ్ ఎస్ ఫూల్కాలు ఉన్నారు. ఇక, పద్మ భూషణ్ అందుకున్నవారిలో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్, వాణిజ్యవేత్త మహస్య ధర్మపాల గులాటీ, పర్వతారోహకురాలు బచేంద్రి పాల్లు ఉన్నారు.
2019 సంవత్సరానికి గాను 112 మంది పేర్లతో పద్మ(పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) పురస్కారాలను ఈ ఏడాది జనవరి 25న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో 47 మందికి మార్చి 11న అవార్డులను ప్రదానం చేయగా... మిగతావారికి శనివారం అవార్డులను అందజేశారు.