రెండో వేగవంతమైన సెంచరీ:
ముక్కోణపు టీ20 టోర్నీలో భాగంగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో జార్జ్ మున్సే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి 41 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ. రోహిత్ శర్మ (ఇండియా), డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), సుదేష్ విక్రమాశేఖర (చెక్ రిపబ్లిక్)లు 35 బంతుల్లో సెంచరీ చేశారు.
అత్యధిక సిక్సర్లు:
జార్జ్ మున్సే తన ఇన్నింగ్స్లో 56 బంతుల్లో 127 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో మున్సే రెండో స్థానంలో నిలిచాడు. హజ్రతుల్లా జజాయ్ (అఫ్గానిస్తాన్) 16 సిక్సర్లు కొట్టగా.. ఫించ్ 14 సిక్సర్లు బాదాడు. ఇన్నింగ్స్ మొదటి బంతి నుంచి చివరి బంతి వరకు మున్సే క్రీజులో ఉండడం విశేషం.
ఒకే ఓవర్.. 32 పరుగులు:
నెదర్లాండ్స్ బౌలర్ మ్యాక్స్ ఒ డౌడ్ వేసిన ఒక ఓవర్లో మున్సే 32 పరుగులు (6,4,4,6,6,6) సాధించాడు. యువరాజ్ సింగ్ (36) తర్వాత ఒక ఓవర్లో బ్యాట్స్మన్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే. గతంలో మరో మూడు సందర్భాల్లో ఒకే ఓవర్లో 32 పరుగులు వచ్చినా.. అవి ఒకే బ్యాట్స్మన్ చేయలేదు.
స్కాట్లాండ్ విజయం:
మున్సేకు తోడు కోయిట్జర్ (50 బంతుల్లో 89; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా బ్యాట్ జులిపించాడు. ఈ జోడి తొలి వికెట్కు 91 బంతుల్లోనే 200 పరుగులు జోడించారు. ఇది ఏ వికెట్కైనా మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. వీరిద్దరి ధాటికి స్కాట్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 252 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 194 పరుగులు చేసి ఓడిపోయింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వాలిఫైయర్ నవంబర్లో ప్రారంభమవుతుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ ట్రై సిరీస్ ఆడుతున్నాయి.