దేశవాళీల్లో సూపర్
ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ అత్యంత అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ క్రికెట్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. అత్యధిక యావరేజ్తో పరుగులు చేస్తున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్మన్ తర్వాత అంత బాగా ఆడుతున్న ఆటగాడు సర్ఫరాజ్ కావడం గమనార్హం. ఇప్పటి వరకు 52 ఇన్నింగ్సులు ఆడిన అతను 3380 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 301 నాటౌట్. ఇంత సూపర్ ఫామ్లో ఉన్న అతన్ని జాతీయ జట్టుకు ఎంపిక చేయడం చాలా మంచి నిర్ణయం అవుతుంది.
మిడిలార్డర్ బలహీనం
ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు భారత జట్టు మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. గతేడాది చివర్లో ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురైన రిషభ్ పంత్ ఇప్పటికే ఈ సిరీస్కు దూరమయ్యాడు. అలాగే కివీస్తో వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే శ్రేయాస్ అయ్యర్ కూడా గాయపడ్డాడు. అతను ఆసీస్ సిరీస్లో ఆడతాడో లేదో తెలియని పరిస్థితి. గతేడాది టెస్టు ఫార్మాట్లో భారత టాప్ స్కోరర్లుగా వీళ్లిద్దరూ నిలిచిన సంగతి తెలిసిందే. వీళ్లు లేని సమయంలో సర్ఫరాజ్ ఖాన్ వంటి ఇన్ఫామ్ ఆటగాడిని జట్టులోకి తీసుకోవడం చాలా కీలకం. అతను మిడిలార్డర్లో పుజారాతో కలిసి నిలకడగా రాణించగలడు. అంతేకాదు, జట్టుకు మంచి విజయాలు కూడా అందించగలడు.
అనుభవం లేని కొత్త వాళ్లు
పంత్, శ్రేయాస్ కనుక ఆస్ట్రేలియాతో సిరీస్లో ఆడకపోతే వాళ్ల స్థానంలో ఆడేందుకు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. అయితే వీళ్లిద్దరికీ టెస్టు ఫార్మాట్లో అనుభవం లేదు. అంతేకాదు, దేశవాళీల్లో కూడా వీళ్లిద్దరి స్ట్రైక్ రేట్, యావరేజ్ అంత గొప్పగా ఏం లేవు.
చాలా మంది పంత్ స్థానాన్ని కిషన్ చక్కగా భర్తీ చేస్తాడని, ఎటాకింగ్ గేమ్ ఆడతాడని అంటున్నారు. అందుకే సర్ఫరాజ్ కన్నా కిషన్ను ఎంపిక చేయడమే కరెక్ట్ అన్నారు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కిషన్ కన్నా సర్ఫరాజ్ స్ట్రైక్ రేట్ ఎక్కువనే విషయాన్ని మర్చిపోకూడదు.