ఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న లోకేష్ రాహుల్లో ఇంకా టెస్టు క్రికెట్లో సరిపోయే నైపుణ్యం లేదని ప్రముఖ కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వన్డే, టీ20ల్లో రాహుల్ మెరుగ్గా రాణిస్తున్నప్పటికీ.. టెస్టు క్రికెట్కు అది కొలమానం కాదని, దేశవాళీ క్రికెట్లో అతడు మరిన్ని పరుగులు సాధించాల్సిన అవసరం ఉందన్నాడు. టెస్టు క్రికెట్లో సీనియర్ బ్యాట్స్మన్ అజింక్యా రహానే స్థానంలో రాహుల్ని తీసుకోవాలని అనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుందన్నాడు.
ప్రస్తుత టెస్టు క్రికెట్కు సరిపడా టెక్నిక్స్ అజింక్యా రహానేలో ఉన్నాయని మంజ్రేకర్ అన్నాడు. ఐదో స్థానంలో రాహుల్ మంచి ప్లేయరే కావొచ్చు కానీ.. రహానే ఉన్నప్పుడు ఆ స్థానంలో మరొకరిని తీసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. కేఎల్ రాహుల్ చివరగా ఆడిన టెస్టులో విఫలమైన సంగతిని మంజ్రేకర్ గుర్తు చేశాడు. వన్డేలు, టీ20ల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చిన రాహుల్.. దాన్ని టెస్టుల్లో కొనసాగించలేకపోతున్నాడన్నాడు. రాహుల్ ఎక్కువ సంఖ్యలో ఫస్ట్క్లాస్ గేమ్స్ ఆడి భారీ స్కోర్లతో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ మేరకు మంజ్రేకర్ తన యూట్యూబ్ చానల్లో పేర్కొన్నాడు.
మయాంక్ అగర్వాల్ దేశవాళీ మ్యాచ్ల్లో ఎలా ఆడి జాతీయ జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారిపోయాడో.. అదే తరహాలో లోకేష్ రాహుల్ కూడా దేశీయ క్రికెట్పై దృష్టి పెట్టాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. ఇక టీమిండియాలో వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల ఆలోచన అవసరం లేదన్నాడు. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప కెప్టెన్లు ఉన్నప్పుడు అలాంటి ఆలోచన అవసరం లేదని మంజ్రేకర్ స్పష్టం చేసాడు. గత కొంతకాలంగా టెస్టు క్రికెట్లో ఓపెనర్లుగా రోహిత్ శర్మ-మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్ను ఆరంభిస్తున్నారు. ఢిల్లీ యువ ఆటగాడు పృథ్వీ షా ఆప్షనల్ ఓపెనర్గా ఉన్నాడు. వీరితో పాటు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, యువ ఆటగాడు శుభ్మన్ గిల్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇటీవలి సంవత్సరాలలో ముంబై ఇండియన్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ టీంపై ఆదిపత్యం చెలాయిస్తోందని మంజ్రేకర్ ఇటీవల అన్నాడు. 'ఐపీఎల్లో ఇటీవలి ఫలితాలను పరిశీలిస్తే ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్పై ఆధిపత్యం చెలాయిస్తోంది. 12 సంవత్సరాలుగా ఐపీఎల్ను పరిశీలిస్తే.. కొన్ని జట్ల విజయాల శాతం పెరుగుతూ వస్తోంది. చెన్నై అక్కడే ఉన్నా.. ముంబై టైటిల్స్ గెలుస్తూ వస్తోంది' అని అన్నాడు. 12 సంవత్సరాల లీగ్ చరిత్రలో 8 సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరుకున్న చెన్నై.. 3 టైటిల్స్ గెలిచింది. మరోవైపు ముంబై ఇండియన్స్ 5 ఫైనలల్లో 4 టైటిల్స్ గెలుచుకుంది.
'రోహిత్ ఓ అరగంట బౌలర్లను వదిలేయాలి.. అప్పుడే విజయవంతమవుతాడు'