సెంచరీ భాగస్వామ్యం
రవీంద్ర జడేజా ఎప్పుడు మంచి ప్రదర్శన చేసినా.. నెటిజన్లు పరోక్షంగా సంజయ్ మంజ్రేకర్ను లక్ష్యంగా చేసుకొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జడేజా కీలక సమయంలో హాఫ్ సెంచరీ (57) చేశాడు. కెప్టెన్ అజింక్య రహానేకు తోడుగా నిలిచి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో జడేజా, మంజ్రేకర్ను ఉద్దేశిస్తూ ఓ నెటిజన్ సరదాగా ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకు ఆ ట్వీట్ ఏంటంటే!!.
జడేజాకు వీరాభిమానిని
టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ తర్వాత భారత జట్టులో అత్యుత్తమ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అని, అతడి రికార్డులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయని ఓ నెటిజన్ తన ట్వీట్లో పేర్కొన్నాడు. అలాగే కొన్నేళ్లుగా జడేజా బ్యాటింగ్ కూడా మెరుగైందని పేర్కొన్నాడు. జడ్డూ రెండో టెస్టులో అద్భుతంగా ఆడాడని మెచ్చుకున్నాడు.
అయితే తాను చెప్పిన విషయాన్ని సంజయ్ మంజ్రేకర్ ఒప్పుకోకపోవచ్చు.. లేదా ఇష్టపడకపోవచ్చు అని సదరు నెటిజన్ ఆ ట్వీట్లో రాసుకొచ్ఛాడు. ఈ ట్వీట్కు సంజయ్ స్పందించాడు. టెస్టుల్లో తానెప్పుడూ జడేజాకు వీరాభిమానినని చెప్పాడు. చాలా ఏళ్లుగా తన అభిప్రాయం అలాగే ఉందన్నాడు. జడేజాకు టెస్ట్ ఫార్మాట్ సరిగ్గా సరిపోతుందని సంజయ్ తెలిపాడు.
బిట్స్ అండ్ పీసెస్ అంటూ
సంజయ్ మంజ్రేకర్ గతేడాది 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాను తేలిక చేసి మాట్లాడిన సంగతి తెలిసిందే. అతడి లాంటి ‘బిట్స్ అండ్ పీసెస్' క్రికెటర్లు తనకు నచ్చరని పేర్కొన్నాడు. దాంతో మంజ్రేకర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పుడే జడేజా కూడా ఘాటుగానే సమాధానమిచ్చాడు. ఇద్దరి రికార్డులు చూసి మాట్లాడాలని, తానేంటో బెటర్ అని బదులిచ్ఛాడు. అప్పటి నుంచీ జడ్డూ ఎక్కడ మంచి ప్రదర్శన చేసినా నెటిజన్లు మంజ్రేకర్ను ఆటాడుకుంటున్నారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో జడేజా (57) అర్ధ శతకం సాధించడంతోనే టీమిండియాకు 131 పరుగుల ఆధిక్యం లభించింది.
|
ఆ తరహా క్రికెటర్లతోనే సమస్య
ఇటీవల ఓ జాతీయ మీడియాతో సంజయ్ మాట్లాడుతూ... 'రవీంద్ర జడేజాతో నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ వైట్బాల్ క్రికెట్లో మాత్రం ఆ తరహా క్రికెటర్లతోనే సమస్య. నా జట్టులో చివరికి హార్దిక్ పాండ్యా లాంటి ఆల్రౌండర్ను కూడా ఎంపిక చేయను. ఆ తరహా క్రికెటర్లు భ్రమను కల్పించే వారు మాత్రమే. అయితే జడేజాను టెస్టు క్రికెటర్గా మాత్రమే భావిస్తా. లాంగెస్ట్ ఫార్మాట్లో మాత్రం అతనికి ఫుల్ మార్క్స్ వేస్తా' అని చెప్పుకొచ్చాడు. మంజ్రేకర్ భారత్ తరఫున 37 టెస్టులు, 74 వన్డేలు ఆడాడు. మొత్తంగా 5 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు బాదాడు. రిటైర్మెంట్ అనంతరం కామెంటేటర్గా కొనసాగుతున్నాడు.