ఇంగ్లండ్లో కారు ప్రమాదం:
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడి. ఆయనకు 'టైగర్ పటౌడి' అనే ముద్దుపేరు కూడా ఉంది. అయితే టైగర్ పటౌడి తన కెరీర్లో ఎక్కువ భాగం ఒక కంటి చూపుతోనే మ్యాచ్లు ఆడారు. పటౌడి 1961లో ఇంగ్లండ్లో కారు ప్రమాదానికి గురయ్యారు. దాంతో ఆయన కుడి కన్ను కనిపించదు. అయినా అలాగే క్రికెట్ ఆడి పరుగుల వరద పారించారు. దాంతో క్రికెట్ ప్రపంచంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు.
ఒకే కంటితో క్రికెట్ కష్టం:
తాజాగా సైఫ్ అలీ ఖాన్ స్పోర్ట్స్ కీడాతో మాట్లాడుతూ తన తండ్రి టైగర్ పటౌడి వైకల్యంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జాఫ్రే బాయ్కాట్ చేసిన వ్యాఖ్యలను వివరించారు. బాయ్కాట్ మాటలు తనకు, తన తండ్రికి కోపం తెప్పించాయని తెలిపారు. 'నేను జాఫ్రే బాయ్కాట్ను చాలా అభిమానిస్తా. ఆయన ఒకసారి నాతో మాట్లాడుతూ... "మీ నాన్న గారి గురించి విన్నాను. కానీ ఒకే కంటితో టెస్టు క్రికెట్ ఆడటమనేది అసాధ్యం" అని అన్నాడు. దాంతో నేను మా నాన్న అబద్ధం చెబుతున్నారని మీరు అనుకుంటున్నారా? అని అడిగా. దానికి అతడు.. అవును నేను అలాగే అనుకుంటున్నా అని బదులిచ్చాడు' అని సైఫ్ తెలిపారు.
చాలా కోపం వచ్చింది:
'జాఫ్రే బాయ్కాట్ మా నాన్న గురించి అలా అనేసరికి నాకు చాలా కోపం వచ్చింది. అదే విషయం మా నాన్నకి చెబితే.. ఆయన కూడా ఆవేశపడ్డారు. రెండు కళ్లతో నాకు బాగా కనపడేది.. ఒక కంటితో కూడా బాగానే కనపడుతోందని నాన్న అన్నారు. ఎవరేమన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏంటో అనేక తెలిస్తే చాలు అని నాన్న అన్నారు' అని సైఫ్ అలీ ఖాన్ వివరించారు. దశాబ్దం పాటు భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన టైగర్ పటౌడి.. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఏకంగా 15,425 పరుగులు చేశారు. పటౌడి సెప్టెంబరు 22, 2011న మరణించారు.