
హైదరాబాద్: క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కారుకు సొట్టలు పడ్డా.. ఆనందంగానే ఉందంటున్నాడు. అంతేగాక, అవి తనకు తీపి జ్ఞాపకాలుగా మారాయంటున్నాడు. తాను వరల్డ్కప్ను అందుకున్న క్షణాలకు గుర్తుగా అవి నిలిచిపోయాయని మంగళవారం 45వ పుట్టినరోజు జరుపుకొన్న సచిన్ చెబుతున్నాడు. ముంబై వాంఖడే స్టేడియంలో 2011 వరల్డ్కప్ గెలచినప్పుడు సొట్టలు పడ్డ కారు తనకు ఆనందాన్నిచ్చిందని సచిన్ తెలిపాడు.
'నాడు మేం వరల్డ్కప్ నెగ్గిన తర్వాత అంజలి మైదానంలోకి రాకూడదని భావించి ఇంటికి వెళ్లిపోయింది. దాంతో, నేను ఆమెకు ఫోన్ చేశా. ఇంట్లో ఏం చేస్తున్నావు? డ్రెస్సింగ్ రూమ్కు వచ్చేయ్. మేమంతా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పా. దాంతో, ఎలాగోలా ఆమె స్టేడియానికి వచ్చింది.
కానీ, అప్పటికే స్టేడియం బయట ప్రజలు నృత్యాలు చేస్తూ, కార్లపై ఎక్కి జంప్ చేస్తూ వరల్డ్కప్ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పుడు అంజలిని చూడగానే ఫ్యాన్స్ సంబరాలను ఆపేశారు. అంజలి ప్రయాణిస్తున్న కారును వారు ఆపకపోవడంతో ఆమె లోపలికి వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి హోటల్కు తిరిగి వెళ్దామని బయటకు వచ్చాం.
అక్కడ మా కారుపై ఉన్న సొట్టలు చూసి ఆశ్చర్యపోయాం. మేడం కారు దిగి లోనికి రాగానే.. ఇక్కడున్నవారంతా కారుపైకి ఎక్కి నృత్యాలు చేయడం మొదలు పెట్టారని డ్రైవర్ చెప్పాడు. వాటిని చూసిన వెంటనే ఈ సొట్టలు.. వరల్డ్కప్ నెగ్గిన అద్భుత క్షణాలకు జ్ఞాపకాలుగా ఉంటాయని చెప్పా. అందుకే వాటిని హ్యాపీ డెంట్స్ అంటున్నాన'ని సచిన్ వివరించాడు.