హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోని... భారత క్రికెట్కు పరిచయం అక్కర్లేని పేరు. కెప్టెన్గా భారత్కు రెండు వరల్డ్ కప్లు అందించిన ఏకైక కెప్టెన్. అంతేకాదు తన క్రికెట్ కెరీర్లో అటు కెప్టెన్గా ఇటు వికెట్ కీపర్గా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.
అలాంటి ధోని గొప్ప కెప్టెన్ అవుతాడని అందరి కంటే ముందు ఊహించింది మాత్రం క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కరే. ధోనిని టీమిండియా కెప్టెన్గా ఎంపిక చేయాలని బీసీసీఐకి సిఫారసు చేసింది సచినే అన్న సంగతి తెలిసిందే. ధోనిలో ఓ కెప్టెన్కు కావాల్సిన లక్షణాలను తాను ఎలా కనిపెట్టాననే విషయాన్ని తాజాగా సచిన్ వెల్లడించాడు.
గౌవర్ కపూర్ నిర్వహించే వెబ్ సిరిస్ 'బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమానికి హాజరైన సచిన్... ధోని వికెట్ కీపర్గా ఉన్న సమయంలో అతడితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. 'నేను స్లిప్లో ఫీల్డింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్ పొజిషన్స్ గురించి కొన్ని ఆలోచనలను ధోనితో పంచుకునే వాడిని' అని సచిన్ అన్నాడు.
'తొలుత నా అభిప్రాయాలను చెప్పేవాడని, ఆ తర్వాత ధోని తన అభిప్రాయాన్ని చెప్పేవాడు. ఈ సందర్భంలో ధోనికి గొప్ప కెప్టెన్ అయ్యే లక్షణాలు ఉన్నాయని గమనించా' అని సచిన్ వివరించాడు. మీరు కెప్టెన్సీ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నారనే విషయం ధోనీకి అప్పుడు తెలిసుండదంటూ గౌరవ్ చమత్కారంగా బదులిచ్చాడు.
సచిన్ సలహా మేరకు 26 ఏళ్ల వయసులో ధోనీ టీమిండియా కెప్టెన్ అయ్యాడు. భారత్కు తిరుగులేని విజయాలు అందించడంతోపాటు టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిపాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ధోని నాయకత్వంలోని భారత జట్టు 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20ని నెగ్గింది.
ఆ తర్వాత 2011లో ఐసీసీ వన్డే వరల్డ్ కప్... 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ధోనిసేన గెలవడాన్ని మనం చూశాం. అంతేకాదు వికెట్ కీపర్గా కూడా ధోని తన కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ఇక, బ్యాటింగ్ విషయానికి వస్తే గొప్ప ఫినిషర్గా ధోనికి పేరుంది. అలాంటి ధోని 2014లో టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత 2017లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుని మూడు ఫార్మాట్లలో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాడు. ప్రస్తుతం జట్టులో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.