తిరువనంతపురం (కేరళ): స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో క్రికెట్కు దూరమైన భారత పేసర్ ఎస్ శ్రీశాంత్ మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. దీనికి కేరళ క్రికెట్ బోర్డు (కేసీఏ) కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్పై ఉన్న నిషేధ కాలం ముగియనుండడంతో అతడిని రంజీల్లోకి తీసుకోనున్నట్లు కేరళ క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో తన రాష్ట్ర రంజీ జట్టు కేరళతో ఆడాలనే యత్నంలో శ్రీశాంత్ ఉన్నాడు.
శ్రీశాంత్ రీఎంట్రీపై కేరళ బ్యాట్స్మన్ సచిన్ బేబీ స్పందించాడు. శ్రీశాంత్ కోసం నిరీక్షిస్తున్నట్లు అతడు తెలిపాడు. ఎప్పుడూ జట్టుకు సలహాలు ఇస్తూ ఉండేవాడన్నాడు. టెలివిజన్ కామేంటేటర్, ప్రజెంటర్ అరుణ్ వేణుగోపాల్తో ఇన్స్టా లైవ్ సెషన్లో సచిన్ బేబీ మాట్లాడుతూ... 'నాకు శ్రీశాంత్ సోదరుడు లాంటివాడు. కేరళ తరఫున మళ్లీ ఆడతాడని ఏడేళ్ల నుంచి ఎదురుచూస్తున్నా. మా జట్టులోని ఆటగాళ్లంతా శ్రీశాంత్ రీఎంట్రీ ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటున్నారు' అని తెలిపాడు.
నేను, శ్రీశాంత్ గత కొన్నేళ్లుగా కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. నాకు శ్రీశాంత్ చాలా సాయం చేశాడు. ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నాం. శ్రీశాంత్తో ప్రాక్టీస్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది. కేరళ జట్టుకు సలహాలు ఇస్తూ సహకరిస్తున్నాడు. అతను నెట్స్లో బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడు. ఇది వరకు శ్రీశాంత్ బౌలింగ్ ప్రాక్టీస్ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇక శ్రీశాంత్ తన ఫిట్నెస్పై శ్రద్ధ చూపించాల్సి ఉంది' అని కేరళ మాజీ కెప్టెన్ సచిన్ బేబీ పేర్కొన్నాడు.
శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు ఆడి 87 వికెట్లు పడగొట్టాడు. 53 వన్డేల్లో 75 వికెట్లు, 10 టీ20ల్లో 7 వికెట్లు తీశాడు. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్కప్ నెగ్గిన జట్లలో శ్రీశాంత్ సభ్యుడు కావడం విశేషం. 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది.
జీవితకాల నిషేధంను శ్రీశాంత్ సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరుతో శ్రీశాంత్ శిక్షాకాలం పూర్తికానుంది.
'ప్రేక్షకులు లేకున్నా ఆడుతా.. టోర్నీలో ఆడేందుకు ఉత్సాహాంగా ఉన్నా'