రోహిత్కు గాయం:
న్యూజిలాండ్తో జరిగిన ఐదవ టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు. అతడి స్థానంలో 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్.. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని పిక్క కండరాలు పట్టేశాయి. ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం ఓ భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత బంతికి రోహిత్ బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి దిగలేదు.
వన్డే సిరీస్కు డౌటే?:
కివీస్, భారత్ జట్ల మధ్య 50 ఓవర్ల ఫ్లార్మాట్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నె 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది. ఐదో టీ20ల్లో గాయపడిన రోహిత్.. వన్డే సిరీస్ ఆడటం అనుమానంగా మారింది. అయితే వన్డే సిరీస్ ప్రారంభానికి మరో రెండు రోజులు సమయం ఉండడంతో.. రోహిత్ కోలుకుంటాడని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది.
బీసీసీఐ పరిశీలనలో రోహిత్:
'రోహిత్ శర్మను ప్రస్తుతం పరిశీలనలో ఉంచాం. త్వరలోనే పూర్తి వివరాలు అందజేస్తాం' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత 'రోహిత్కు ఫర్వాలేదు. గాయం అవ్వడం దురదృష్టకరం. అతడు రెండు, మూడు రోజుల్లో కోలుకోవచ్చు' అని లోకేష్ రాహుల్ తెలిపాడు. ఇప్పటికే టీ20 సిరీస్ ముందు గాయం కారణంగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
ఐదో టీ20లో విజయం:
ఆదివారం జరిగిన ఐదో టీ20 మ్యాచ్లో మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ (41 బంతుల్లో 60 రిటైర్డ్ హర్ట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించారు. కుగ్లిన్ 2 వికెట్లు తీశాడు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసి ఓడింది. రాస్ టేలర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్లు), టీమ్ సీఫెర్ట్ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ చెరో 2 వికెట్లు తీశారు.