ఐకమత్యంగా ముందడుగు వేస్తేనే..:
రోహిత్ శర్మ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసి భారత ప్రజలకు విన్నపం చేసాడు. 'గత కొన్ని వారాలుగా మనం చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ప్రపంచమంతా వైరస్ కారణంగా నిస్తేజంగా మారింది. మనంమందరం కలిసికట్టుగా ఐకమత్యంగా ముందడుగు వేస్తేనే.. తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయి. మనం అందరం మరింత అప్రమత్తంగా, చురుగ్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది' అని రోహిత్ కోరాడు.
పరిసరాలపై ఓ కన్నేసి ఉంచాలి:
'వైరస్ దరిచేరకముందే జాగ్రత్తలు పాటించాలి. పరిసరాలపై ఓ కన్నేసి ఉంచాలి. కరోనాకు సంబంధించిన లక్షణాలు ఎదురైనప్పుడు వెంటనే సమీప వైద్యాధికారులకు సంప్రదించాలి. ఎందుకంటే.. మన పిల్లలు పాఠశాలకు వెళ్లాలని అందరూ కోరుకుంటాం. మనం కూడా మాల్స్ వెళ్లాలనుకుంటాం , థియేటర్లలో సినిమాలు చూడాలనుకుంటాం. తగినన్ని జాగ్రత్తలు పాటిస్తే, త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశముంది' అని రోహిత్ అన్నాడు.
వైద్య సిబ్బంది కృషికి నా అభినందనలు:
కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు ట్రీట్మెంట్ అందించిన వైద్యులు, నర్సులపై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'తమ ప్రాణాలను లెక్క చేయకుండా.. కరోనా బాధితులకు పరీక్షలు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది కృషికి నా అభినందనలు. చివరగా ఒక్కమాట.. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి' అని రోహిత్ సూచించాడు. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపాడు. కరోనా వైరస్ దాదాపు 120 దేశాలకు వ్యాపించింది.
ధైర్యంగా యుద్ధం చేద్దాం:
అంతకుముందు కొవిడ్-19పై టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా స్పందించాడు. 'ప్రజలందరూ కరోనా వైరస్పై పోరాడేందుకు దృఢచిత్తంతో ముందుకు కదలండి. కరోనా వ్యాప్తికి వ్యతిరేకంగా పోరాడదాం. అందరూ ముందుజాగ్రత్త చర్యలు తీసుకోండి. ముఖ్యంగా వైరస్ బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమ మార్గం' అని ట్విటర్ వేదికగా కోహ్లీ సూచించాడు. కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగే పలు క్రీడల పోటీలను వాయిదా వేసిన నేపథ్యంలో కోహ్లీ దేశ ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెప్పాడు.