టీమిండియాకు భారీ షాక్:
వన్డే సిరీస్కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఓపెనర్ 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ గాయం (పిక్క కండరాలు పట్టేయడం) కారణంగా వన్డే, టెస్ట్ సిరీస్లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని సోమవారం బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపినట్టు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. 'కండరాలు పట్టేయడంతో త్వరలో న్యూజిలాండ్తో జరిగే వన్డే, టెస్ట్ సిరీస్ నుండి రోహిత్ తప్పుకున్నాడు' అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
అగర్వాల్కు అవకాశం:
రోహిత్ శర్మ బదులుగా జట్టులోకి ఎవరు రానున్నారో ఇంకా తెలియరాలేదు. అయితే రోహిత్ శర్మ స్థానంలో మయాంక్ అగర్వాల్ జట్టులోకి వచ్చే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. శుభమాన్ గిల్కు కూడా అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఇప్పటికే యువ ఓపెనర్ పృథ్వీ షా జట్టులో ఉండడంతో.. అతనితో ఈ ఇద్దరిలో ఒకరు ఓపెనర్గా రానున్నారు. కేఎల్ రాహుల్ ఐదవ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
ఐదవ టీ20లో గాయం:
ఐదవ టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన రోహిత్ శర్మ.. 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ షాట్ కొట్టగా .. సింగల్ తీసే క్రమంలో రోహిత్ పిక్క కండరాలు పట్టేశాయి. మొదటగా ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స చేశాడు. అనంతరం ఓ భారీ సిక్స్ బాదినా.. ఆ తర్వాత బంతికి రోహిత్ బాగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఫీల్డింగ్ సమయంలో కూడా మైదానంలోకి దిగలేదు.
ఇప్పటికే ధావన్ ఔట్:
ఈ నెల 5న హామిల్టన్ వేదికగా తొలి వన్డే జరుగనుంది. ఫిబ్రవరి 8న ఆక్లాండ్ వేదికగా రెండో వన్డే, ఫిబ్రవరి 11న బే ఓవల్ వేదికగా మూడో వన్డే జరగనుంది. వన్డే సిరీస్ ప్రారంభానికి మరో రెండు రోజులు సమయం ఉండడంతో.. రోహిత్ కోలుకుంటాడని జట్టు మేనేజ్మెంట్ భావించింది. కానీ ఆ వకాశం లేకుండా పోయింది. ఇప్పటికే టీ20 సిరీస్ ముందు గాయం కారణంగా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్/శుభమాన్ గిల్, పృథ్వీ షా, లోకేష్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్.